ఆ సినిమా చేయట్లేదన్న కీర్తి సురేష్

Keerthy Suresh

‘మహానటి’తో దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు తన వైపు తిరిగి చూసేలా చేసిన నటి కీర్తి సురేష్. ఆ చిత్రం ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద విజయం సాధించింది. కన్నడ, మలయాళ ప్రేక్షకులు కూడా అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను బాగానే చూశారు. కీర్తికి ఈ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు రావడంతో ఉత్తరాది వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు.

ఈ గుర్తింపుతో కీర్తికి హిందీలోనూ ఓ భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదే.. మైదాన్. హైదరాబాద్‌కు చెందిన ఓ లెజెండరీ ఫుట్‌బాలర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. ఇందులో అజయ్ దేవగణ్ లీడ్ రోల్ చేస్తుండగా.. ఆయన సరసన కీర్తిని ఎంచుకున్నారు. సినిమా మొదలైనపుడు అధికారికంగా కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా-లాక్ డౌన్ లేకుంటే ఇప్పటికే ఈ చిత్రం పూర్తి కావాల్సింది కూడా.

కరోనాతో బ్రేక్ పడ్డ ఈ చిత్రాన్ని త్వరలోనే మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ సినిమా నుంచి తాను తప్పుకున్నట్లు తాజాగా కీర్తి వెల్లడించింది. తన కొత్త చిత్రం ‘మిస్ ఇండియా’ ప్రమోషన్లలో భాగంగా ఆమె మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించింది. కారణాలు చెప్పలేదు కానీ.. ఆ సినిమాలో తాను భాగం కాదని మాత్రం తెలిపింది. మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించబోతుండటం చాలా ఉద్వేగంగా ఉన్నట్లు చెప్పింది కీర్తి.

తమిళంలో రజనీకాంత్ సరసన ‘అన్నాత్తె’లో ఓ విభిన్నమైన పాత్ర చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. మలయాళంలో మోహన్ లాల్ సినిమాలోనూ నటిస్తున్నట్లు తెలిపింది. మరో రెండు పెద్ద సినిమాలు చర్చల దశలో ఉన్నాయంది. ‘మహానటి’ తర్వాత తాను విని ఓకే చేేసిన తొలి కథ ‘మిస్ ఇండియా’దే అని.. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ఈ సినిమాలో పాత్ర డిమాండ్ చేయడంతోనే తాను బాగా బరువు తగ్గాల్సి వచ్చిందని చెప్పింది కీర్తి. మంగళవారం అర్ధరాత్రి నుంచే ‘మిస్ ఇండియా’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.