రాధేశ్యామ్.. అక్కడేదో మ్యాజిక్ జరుగుతోంది

కొన్ని సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంతకాలం అమావాస్యకో పౌర్ణమికో ఓ అప్‌డేట్ వదులుతూ వచ్చిన మేకర్స్.. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో వరుస అప్‌డేట్స్తో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఒకదాని తర్వాత ఒకటిగా పాటలు వదులుతున్నారు. ఇవాళ హిందీ వెర్షన్‌ నుంచి ‘సోచ్‌లియా’ అనే పాట బైటికొచ్చింది.

ఇప్పటి వరకు వచ్చిన పాటల్లో ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య ప్రేమ కనిపిస్తే.. ఇవాళ విడుదలైన పాటలో ఒకరికొకరు దూరమైన బాధ కనిపిస్తోంది. ఇద్దరూ కలిసి గడిపిన అనుభూతులు.. కలవలేక కుమిలిపోతున్న క్షణాలు.. మాటరాని మౌనాలు.. కళ్లనుండి జారే కన్నీళ్లు.. మొదట్నుంచి చివరి వరకు ఎమోషనల్‌గా సాగిందీ పాట. మిథున్‌ ట్యూన్‌ మనసుల్ని తాకేలా ఉంటే.. అర్జీత్ సింగ్ గానం భావోద్వేగాల్ని తట్టి లేపుతోంది.

కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ‘నగుమోము తారలే’ అనే పాట విడుదలయ్యింది. అదే రోజు తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీ వెర్షన్‌ కూడా వచ్చింది. తెలుగు పాటతో పోలిస్తే హిందీ పాట చాలా బాగుందనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈసారి ఈ పాట హిందీ వెర్షన్ మాత్రమే విడుదలైంది. ఈ సిట్యుయేషన్‌ కోసం సౌత్ లాంగ్వేజెస్‌లో చేసిన పాట రాలేదు. దాంతో తెలుగు సాంగ్ ఎలా ఉంటుందో చూడాలనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఒకటి మాత్రం నిజం. తెలుగుతో పోలిస్తే హిందీ వెర్షన్ మ్యూజిక్ విషయంలో ఏదో మ్యాజిక్ జరుగుతోందనిపిస్తోంది..

సౌత్‌ లాంగ్వేజెస్‌కి జస్టిన్ ప్రభాకరన్‌ చేసిన ట్యూన్స్‌ కంటే హిందీ వెర్షన్‌కి మిథూన్ కంపోజ్ చేసిన ట్యూన్స్ క్యాచీగా ఉన్నాయి. లిరిక్స్‌ పరంగా కూడా హిందీనే బెటరనిపిస్తోంది. ఇప్పటి వరకు రాధేశ్యామ్ నుంచి వచ్చిన పాటల లిరిక్స్‌ ఏవీ సరిగ్గా అర్థం కావడం లేదనే కంప్లయింట్ తెలుగు ఆడియెన్స్ నుంచి వచ్చింది. కానీ హిందీలో మాత్రం సింపుల్‌ లిరిక్స్‌తో, అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి పాటలు. అక్కడే సాంగ్స్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి కూడా. ఓవరాల్‌గా సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు కానీ.. మ్యూజిక్‌ పరంగా మాత్రం బాలీవుడ్‌లోనే రాధేశ్యామ్‌కి ఎక్కువ మార్కులు పడుతున్నాయేమో అనిపిస్తోంది.