ఏమాయ చేసావె గుర్తొచ్చింద‌న్న‌ స‌మంత‌

ఈ రోజు ఒక సెన్సేష‌న‌ల్ అప్‌డేట్‌తో వార్త‌ల్లో నిలిచింది స‌మంత‌. అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్ పేరుతో ఆమె ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ చేయ‌నున్న సంగ‌తి వెల్ల‌డైంది. హాలీవుడ్ మూవీ డౌన్ టౌన్ అబేను రూపొందించి ఫిలిప్ జాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ ద‌ర్శ‌కుడితో స‌మంత క‌లిసున్న ఫొటో కూడా సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చింది.

స‌మంత ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ చేయ‌డ‌మే విశేషం అంటే.. అందులో ఆమెది బై సెక్సువ‌ల్ రోల్ అనేస‌రికి ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం స‌మంత ఆడిష‌న్ ఇచ్చి మ‌రీ సెల‌క్ట్ అయింద‌ట‌. తెలుగులో త‌న అరంగేట్ర సినిమా ఏమాయ చేసావెకు తాను ఆడిష‌న్ ఇచ్చాన‌ని.. ఆ త‌ర్వాత ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ ఆడిష‌న్ ఇవ్వ‌డంతో ఏమాయ చేసావె రోజులు గుర్తుకు వ‌చ్చాయ‌ని స‌మంత అంది.

ఈ సినిమాకు స‌మంత ఎంపిక కావ‌డంపై సోష‌ల్ మీడియాలో స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురుస్తుండ‌గా.. స‌మంత కూడా చాలా ఎగ్జైటెడ్‌గా అంద‌రికీ థ్యాంక్స్ చెబుతూ త‌న ఆనందాన్ని పంచుకుంటోంది. ఇదిలా ఉండ‌గా.. ఒక బాలీవుడ్ మీడియా సంస్థ నిర్వ‌హించిన చిట్ చాట్ కార్య‌క్ర‌మంలో వేరే ఆర్టిస్టుల‌తో క‌లిసి పాల్గొన్న స‌మంత‌.. 2021 త‌న‌కు చాలా క‌ఠిన‌మైన ఏడాదిగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

అక్కినేని నాగ‌చైత‌న్య‌తో నాలుగేళ్ల వైవాహిక జీవితానికి తెర‌దించుతూ అత‌డి నుంచి స‌మంత విడిపోయింది ఈ ఏడాదే. అందుకే ఆమె 2021ని క‌ఠిన‌మైన సంవ‌త్స‌రంగా పేర్కొన్న‌ట్లుంది. విడాకుల త‌ర్వాత ఆమె చేస్తున్న తొలి చిత్రం కాదువాకుల రెండు కాద‌ల్ డిసెంబ‌రులోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.