మహేష్‌ సినిమా ఆగిపోయిందంటే ఒప్పుకోవట్లేదు

Mahesh Vamsy Paidipally
Mahesh Vamsy Paidipally

‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సింది. వంశీ ఈ ప్రాజెక్ట్ గురించి చాలాసార్లు ప్రస్తావించాడు కూడా. అయితే ఏమైందో ఏమో కాని తనకు ‘మహర్షి’ వంటి మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లిని కాదని, ‘గీత గోవిందం’ ఫేమ్ పరుశురామ్‌కి ఛాన్స్ ఇచ్చాడు సూపర్ స్టార్. అయితే మహేష్‌తో సినిమా లేట్ కావచ్చు కానీ ఆగిపోలేదని అంటున్నాడు వంశీ పైడిపల్లి.

మహేష్ కెరీర్‌లో 25వ సినిమాగా రూపొందిన ‘మహర్షి’లో కాలేజ్ కుర్రాడిగా, యంగ్ బిజినెస్ మ్యాన్‌గా, స్నేహితుడి కోసం ఏం చేయడానికైన వెనుకాడని ఫ్రెండ్‌గా అద్భుతంగా నటించి, మెప్పించాడు మహేష్. ఈ మూవీ టైంలోనే మహేష్‌కి, వంశీ పైడిపల్లికి మంచి సింక్ కుదిరిందని, ఆ బంధంతోనే సూపర్ స్టార్, తన 27వ సినిమా కూడా ఈ డైరెక్టర్‌తోనే కమిట్ అయ్యాడని వార్తలు వచ్చాయి.

అయితే వంశీ పైడిపల్లి చెప్పిన స్క్రిప్ట్‌తో పెద్దగా ఇంప్రెస్ కాని మహేష్… ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల కథలు విని, చివరికి పరుశురామ్‌తో సినిమాను కన్ఫార్మ్ చేశాడు. అయితే మహేష్‌తో సినిమా రద్దు కాలేదని, త్వరలోనే సూపర్ స్టార్‌తో సినిమా చేస్తానంటున్నాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. కాని మూవీ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

ఒకవేళ నిజంగానే వంశీ కనుక మహేష్‌‌ను మెప్పించే స్క్రిప్ట్ పట్టినా, పరుశురామ్‌తో, రాజమౌళితో మూవీ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయకతప్పదు. లాక్‌డౌన్ తర్వాత పరుశురామ్ మూవీ ప్రారంభమైనా, రాజమౌళి- మహేష్ మూవీ పూర్తవ్వాలంటే ఎంతలేదన్నా మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే. మరి వంశీ పైడిపల్లి, మహేష్ కోసం అన్నేళ్ళు వెయిట్ చేస్తాడా?