ఎనిమిది దేశాల్లో యాక్షన్.. అయితే ఎగబడిపోతారా?

కొవిడ్ తర్వాత బాలీవుడ్ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో చూస్తూనే ఉన్నాం. గత వారం వచ్చిన అజయ్ దేవగణ్ సినిమా ‘దృశ్యం-2’ వంద కోట్ల కలెక్షన్లు సాధిస్తే దాన్నో అద్భుతం లాగా మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీ అంతటా పండగ వాతావరణం నెలకొంది. కానీ పదేళ్ల ముందే బాలీవుడ్ స్టార్లకు వంద కోట్ల వసూళ్లనేవి కేక్ వాక్ అన్నట్లు ఉండేది. కానీ కొవిడ్ తర్వాత మారిన పరిస్థితుల్లో వంద కోట్ల థియేట్రికల్ రెవెన్యూ కూడా చాలా పెద్ద విషయం అయిపోయింది.

అక్కడ పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు కూడా దారుణంగా బోల్తా కొడుతున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ లాంటి టాప్ స్టార్‌కు కూడా ‘లాల్ సింగ్ చడ్డా’తో ఘోర పరాభవం ఎదురైంది బాక్సాఫీస్ దగ్గర. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ ఏమవుతుందా అని అందరూ ఉత్కంఠతో ఉన్నారు. ‘జీరో’ పెద్ద డిజాస్టర్ కావడంతో రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని.. ఆ తర్వాత ‘పఠాన్’ చిత్రాన్ని పట్టాలెక్కించి చాలా జాగ్రత్తగా ఈ సినిమా చేస్తున్నాడు షారుఖ్.

ఈ మధ్యే రిలీజైన ‘పఠాన్’ టీజర్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు ఈ టీజర్ సూపరన్నప్పటికీ ఇలాంటివి ‘సాహో’లో ఎప్పుడో చూసేశాం.. అయినా ఆ గ్రాఫిక్స్ ఏంటి అంటూ కొందరు కౌంటర్లు వేశారు. ఈ పరిస్థితుల్లో ‘పఠాన్’ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేని పరిస్థితి. ఐతే చిత్ర బృందం మాత్రం ప్రతిసారీ బడ్జెట్, భారీతనం గురించే మాట్లాడుతూ వస్తోంది. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ దాదాపు మూడొందల కోట్ల బడ్జెట్లో రూపొందిస్తున్నట్లు సమాచారం.

తాజాగా ఈ చిత్ర యాక్షన్ సన్నివేశాలు 8 దేశాల్లో చిత్రీకరించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. స్పెయిన్, యూఏఈ, టర్కీ, రష్యా, ఇటలీ, సెర్బియా, ఇండియా, ఆఫ్గనిస్థాన్ దేశాల్లో చిత్రీకరించిన భారీ యాక్షన్ ఘట్టాల గురించి స్వయంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ట్విట్టర్ పోస్టు పెట్టింది. ఐతే ఇలా భారీ యాక్షన్ ఘట్టాలు కొత్త కాదు. ఎన్నెన్నో దేశాల్లో చిత్రీకరించడమూ కొత్త కాదు. ‘సాహో’ సహా పలు చిత్రాలు ఈ ఫీట్లు చేశాయి. కేవలం ఈ భారీతనం గురించి బిల్డప్ ఇస్తే జనాలు ఎగబడి పోయే రోజులు పోయాయి. అంతకుమించి సినిమాలో కంటెంట్ ఎంత ఉందన్న దాన్ని బట్టే షారుఖ్ రీఎంట్రీ మూవీ భవితవ్యం తేలుతుంది.