చిరు స్థానంలో చరణ్ వస్తాడా

అనుకున్నట్టే క్రిస్మస్, సంక్రాంతి సినిమాల విడుదల తేదీలలో అనూహ్యమైన మార్పులు రావడం ఖాయమనే టాక్ ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. డిసెంబర్ 20 రావాల్సిన గేమ్ ఛేంజర్ హఠాత్తుగా జనవరికి వెళ్ళిపోయిందనే వార్త అభిమానులను అయోమయానికి గురి చేసింది. ఎందుకంటే అదే నెల 10 విశ్వంభర ఉంది. తండ్రి కొడుకుల క్లాష్ జరగడం అసాధ్యం. అలాంటప్పుడు ఈ ఆప్షన్ ఎలా అనుకున్నారనే డౌట్ రావడం సహజం. రెండు మూడు వారాలుగా చికెన్ గున్యాతో బాధ పడుతున్న చిరంజీవి పూర్తిగా కోలుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందట. దాని వల్లే బ్యాలన్స్ షూట్ ఆలస్యమవుతుంది.

ఒకవేళ ఇదే జరిగి విశ్వంభర పోస్ట్ పోన్ అయితే గేమ్ చేంజర్ ని సంక్రాంతికి దింపాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్. అదే పండక్కు తన బ్యానర్ లోనే రూపొందుతున్న వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా ఉన్నప్పటికీ రెండింటి మధ్య మూడు రోజుల గ్యాప్ ఉండేలా చూసుకోవాలని అనుకుంటున్నారు. దీనికి ఎవరూ అడ్డు చెప్పలేరు. ఎందుకంటే గతంలో మైత్రి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలు ఒక రోజు వ్యవధిలో రిలీజ్ చేశాక దాని గురించి ఇకపై మాట్లాడేందుకు లేకుండా పోయింది. సో దిల్ రాజుకి ఎవరికో సమాధానం చెప్పాలన్న టెన్షన్ అక్కర్లేదు. విశ్వంభర టీమ్ మాత్రం దసరాకు టీజర్ వదిలేందుకు రెడీ అవుతోంది.

ఈ దోబూచులాట వల్లే గేమ్ ఛేంజర్ పోస్టర్లలో రిలీజ్ డేట్ ఇవ్వడం లేదని మెగా కాంపౌండ్ న్యూస్. ఇదంతా తేలాలంటే ఇంకొన్ని వారాలు టైం పట్టేలా ఉంది. డిసెంబర్ నుంచి రామ్ చరణ్ తప్పుకున్న పక్షంలో బాలయ్య 109 లేదా నాగచైతన్య తండేల్, మంచు విష్ణు కన్నప్ప వచ్చే ఛాన్స్ కొట్టిపారేయలేం. లేదూ అంటే నితిన్ రాబిన్ హుడ్, నితిన్ నార్నె మ్యాడ్ 2 లాంటివి ముందు జాగ్రత్త చర్యగా రెడీ అవుతున్నాయి. వీటి సంగతి ఎలా ఉన్నా ఈ పరిణామాల వల్ల డిసెంబర్ 6 రాబోయే పుష్ప 2 ది రూల్ లాభ పడటం ఖాయం. మొత్తానికి టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాలు ఏదో ఒక కారణంతో వాయిదాల గండం తప్పించుకోలేకపోతున్నాయి.