ప్రకాష్ రాజ్ వాయిస్ తీసేశారు

బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్.. ఈ మధ్య అప్పుడప్పుడు దక్షిణాది చిత్రాల్లోనూ నటిస్తున్నారు. తెలుగులో సైరా, కల్కి లాంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆ చిత్రాలకు ఆకర్షణగా మారారు. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘వేట్టయాన్’లో స్పెషల్ రోల్ చేశారు.

గతంలో అమితాబ్ నటించిన హిందీ చిత్రాల్లో రజినీ క్యామియో రోల్స్ చేయగా.. ఇప్పుడు బిగ్-బి బదులు తీర్చుకుంటున్నారు. ఫేక్ ఎన్‌కౌంటర్స్ నేపథ్యంలో ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 10నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ సినిమాలో అమితాబ్ కోసం ముందు ప్రకాష్ రాజ్‌తో డబ్బింగ్ చెప్పించారు. అమితాబ్ పాత్ర పరిచయంతో రిలీజ్ చేసిన చిన్న టీజర్లో ప్రకాష్ రాజ్ వాయిసే వినిపించింది.

ఐతే అమితాబ్ బచ్చన్‌కు ప్రకాష్ రాజ్ వాయిస్ అస్సలు సూట్ కాలేదన్న వ్యాఖ్యలు వినిపించాయి. ప్రకాష్ రాజ్ ఆల్రెడీ పాపులర్ యాక్టర్. ఆయన వాయిస్ కూడా అంతే పాపులర్. అమితాబ్ వాయిస్ మీదా సౌత్ ఆడియన్స్‌కు ఐడియా ఉంది. దీంతో అమితాబ్‌కు ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెప్పడం ఆడ్‌గా అనిపించింది. సోషల్ మీడియాలో పూర్తిగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో టీం అప్రమత్తమైంది. సినిమాలో ప్రకాష్ రాజ్ వాయిస్ వినిపించదట. అలా అని అమితాబ్ సొంతంగా డబ్బింగ్ చెప్పే పరిస్థితి కూడా లేదు. వేరే ఆర్టిస్టుతోనూ డబ్బింగ్ చెప్పించట్లేదు.

ఏఐ టెక్నాలజీ సాయంతో అమితాబే డబ్బింగ్ చెప్పినట్లు మేనేజ్ చేయబోతున్నారట. దివంగత లెజెండ్స్ వాయిస్‌ను పాటల కోసం ఏఐతో రీక్రియేట్ చేశాం కానీ.. ఇలా బతికున్న వారి వాయిస్‌ను కూడా ఏఐతో మేనేజ్ చేయడం విశేషమే. చూస్తుంటే ఏఐ సాయంతో మనిషి అవసరం లేకుండానే ఏమైనా చేసేస్తారు అనిపిస్తోంది. ‘వేట్టయాన్’లో ఈ ప్రయోగం విజయవంతం అయితే మున్ముందు సినిమాల్లో ఏఐతో మరెన్నో అద్భుతాలు చూడొచ్చన్నమాట.