మెగా అపోహలు తొలగించిన కొరటాల

దేవర విడుదల ఇంకో మూడు రోజుల్లో ఉన్న నేపథ్యంలో దీని తాలూకు ఫీవర్ ఓ రేంజ్ లో పెరిగిపోతోంది. ఫ్యాన్స్ సంబరంగా ఎదురు చూస్తుండగా ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా తారక్ విశ్వరూపాన్ని చూసేందుకు సగటు ప్రేక్షకులు కూడా సిద్ధపడుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొరటాల శివ పలు ఆసక్తికరమైన సంగతులు పంచుకున్నారు. ముఖ్యంగా ఆచార్య రిలీజయ్యాక చిరంజీవికి ఈయనకి ఏవో విభేదాలు వచ్చాయని, ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ దర్శకుడి మీద నింద వేసినట్టుగా వచ్చిన వార్తలు బాగా తిరిగాయి. ఈ విషయంలో డిజాస్టర్ ఫలితానికి మించిన చర్చ జరిగింది.

దానికి ఈ రోజు చెక్ పెట్టేశారు కొరటాల శివ. రిలీజై ఫలితం వచ్చిన టైంలో చిరంజీవి వెంటనే ఫోన్ చేసి నువ్వు బలంగా కంబ్యాక్ అవుతావని చెప్పారని, అది బయటికి తెలియకపోవడంతో తనను ఆయన ఏదో అన్నట్టుగా ప్రచారం చేశారని వివరణ ఇచ్చారు. అంతే కాదు ఆచార్య ఫ్లాప్ ప్రభావం తన మీద ఎంత మాత్రం లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఒక ప్రధాన అపోహను తొలగించినట్టయ్యింది. స్టార్ హీరోలకు ఇలాంటి పరాజయాలు కొత్తేమి కాదు కానీ ఆచార్య విషయంలో కాస్త ఎక్కువ డిస్కషన్, ట్రోలింగ్ జరిగింది. దాన్ని క్లియర్ చేసే అవకాశం మీడియా ముఖంగా కొరటాలకు దొరకలేదు.

ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. ఆ గాయం పూర్తిగా మానిపోయేలా దేవర ప్రతి ఒక్కరిని అలరిస్తుందని భరోసా ఇస్తున్నారు. నెరేషన్ ఇవ్వడానికే నాలుగు గంటలు పట్టినందువల్లే ఇంత మంచి కథను హడావిడి పడకూడదని గుర్తించి రెండు భాగాల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంచనాలు పీక్స్ లో ఉన్న వేళ దర్శకుడిగా కొరటాల చెబుతున్న మాటలు మంచి ఎలివేషన్లు ఇస్తున్నాయి. తన డెబ్యూ మిర్చి తర్వాత మళ్ళీ ప్రభాస్ తో చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న కొరటాల శివ దేవర రెండో భాగం పూర్తి చేశాక ఈ కాంబోని రిపీట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.