ప్రభాస్ సినిమా కంటే ముందు ఇది

‘మహానటి’ సినిమాతో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు నాగ్ అశ్విన్. ఒక్క సినిమాతో అతను చేసిన లాంగ్ జంప్ అలాంటిలాంటిది కాదు. ఏకంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో సినిమా చేసే అవకాశం పట్టేశాడు. ‘ఆదిత్య 369’ తరహా ఫాంటసీ టచ్ ఉన్న సైంటిఫిక్ థ్రిల్లర్ అతను చేయబోతున్నట్లు సంకేతాలు అందుతున్న సంగతి తెలిసిందే.

ఐతే ఈ సినిమాకు ప్రి ప్రొడక్షన్ వర్క్ చాలా పెద్ద స్థాయిలో చేయాల్సి ఉంది. అలాగే ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో పాటు ‘ఆదిపురుష్’ను పూర్తి చేశాక కానీ ఈ ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తంగా కనీసం ఏడాది పాటు అశ్విన్ ఎదురు చూడక తప్పేట్లు లేదు. ఈ సమయంలో ప్రభాస్ చిత్రం ప్రి ప్రొడక్షన్, స్క్రిప్టు పనులు చూసుకుంటేనే ఒక వెబ్ సిరీస్ లాగించేశాడట నాగ్ అశ్విన్.

అల్లు వారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ కోసం నాగ్ అశ్విన్ ఒక వెబ్ సిరీస్ తీశాడట. సింపుల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సిరీస్ అట అది. ఇందులో శ్రుతి హాసన్ ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం. చడీచప్పుడు లేకుండా ఈ సిరీస్‌ను మొదలుపెట్టి పూర్తి చేశారట. టాలీవుడ్లో కాస్త పేరున్న యువ దర్శకులు లైన్లో పెట్టి ఈ సిరీస్‌లో ఒక్కో భాగాన్ని చేయించినట్లు తెలుస్తోంది. ప్రధాన పాత్రలకు కూడా పేరున్న ఆర్టిస్టులనే తీసుకున్నారు.

ఒక పోర్షన్‌కు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా.. తమన్నా లీడ్ రోల్ చేసింది. మిగతా పోర్షన్లను కూడా పేరున్న దర్శకులు, ఆర్టిస్టులే చేసినట్లు సమాచారం. ఆహాలో ఇంతకుముందు వచ్చిన వెబ్ సిరీస్‌లు ఏవీ అంచనాల్ని అందుకోలేకపోయాయి. అందులోకి వచ్చిన కొత్త సినిమాలు కూడా తక్కువే. ఈ మధ్య మరీ మలయాళ సినిమాల్ని డబ్ చేసి రిలీజ్ చేయడంతో సరిపెడుతున్నారు. దీంతో కొంచెం క్వాలిటీ కంటెంట్ పెంచాలని డిసైడయ్యారు. ఈ క్రమంలోనే ఒరేయ్ బుజ్జిగా, కలర్ ఫోటో సినిమాలను రిలీజ్ చేయడంతో పాటు క్వాలిటీ వెబ్ సిరీస్‌లను తయారు చేయిస్తున్నట్లున్నారు.