బాబోయ్ అజయ్ టబు అంటున్నారు

హైప్ తో సంబంధం లేకుండా మాములుగా ఒక స్టార్ హీరో సినిమా రిలీజైతే దాన్ని ఖచ్చితంగా మొదటి రోజు చూసే అభిమనులు బోలెడు ఉంటారు. కనీసం మార్నింగ్, మ్యాటీలు ఫుల్ చేసేంత కెపాసిటీ అతనికి ఉంటుంది. కానీ అసలే అంచనాలు లేకుండా జనంలో ఆసక్తే కనిపించకుండా చేసేవి ఈ మధ్య కాలంలో తరచుగా వస్తున్నాయి. నిన్న రిలీజైన ఆరోన్ మే కహాన్ దం థా ఈ క్యాటగిరిలోకే వస్తుంది. కరోనా తర్వాత దృశ్యం 2, షైతాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ చూసిన అజయ్ దేవగన్ మూవీకి మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం కోటిన్నర కలెక్షన్ వచ్చిందంటే నమ్మగలమా. కానీ ఇది అక్షరాలా నిజం.

ముందు కథేంటో చూద్దాం. 2000 నుంచి 2024 సంవత్సరాల మధ్య జరిగిన ఒక ప్రేమ కథ ఇది. కృష్ణ(అజయ్ దేవగన్) వసుధ (టబు) లు యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. అయితే అనుకోకుండా జరిగిన సంఘటనల వల్ల కృష్ణ కొన్ని హత్యలు చేసి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో వసుధ అతన్నుంచి విడిపోయి అభిజీత్ (జిమ్మీ షెర్గిల్) ని పెళ్లి చేసుకుంటుంది. సుదీర్ఘమైన శిక్షను అనుభవించి బయటికి వచ్చిన కృష్ణ ఒక్కసారి వసుధని కలవాలనుకుంటాడు. ఆ తర్వాత జరిగేది తెరమీద చూడాల్సిందే. దర్శకుడు నీరజ్ పాండే ఒక ఎమోషనల్ డ్రామాని చూపించే ప్రయత్నం చేశారు.

అయితే సహనానికి పరీక్ష పెట్టే సన్నివేశాలు, బాబోయ్ ఇదెక్కడి బోర్ అనిపించే ఎపిసోడ్లతో ఫుట్ బాల్ ఆడేయడంతో ఆరోన్ మే కహాన్ దం థా ఏ దశలోనూ కనీసం పర్వాలేదనిపించుకునే ఛాన్స్ ఇవ్వలేదు. ఉన్నంతలో మన ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం కొంత స్వాంతన కలిగించేలా ఉన్నా ఆయన సైతం యాక్సిడెంట్ లో తుక్కతుక్కయిన బండిని కాపాడలేకపోయారు. అజయ్ దేవగన్ ఓవర్ సీరియస్ గా కనిపిస్తే టబు, ఆమె యవ్వనపు పాత్రలో సయీ మంజ్రేకర్ ఓకే అనిపిస్తారు. ఓపిక ఎంత ఉన్నా థియేటర్ లో కూర్చోవడం ఇంత భారమా అనిపించే ఆరోన్ మే కహాన్ దం థాని మీ స్వంత రిస్క్ మీద ప్రయత్నించవచ్చు.