కమిటీ కుర్రాళ్ళ కోసం నీహారిక ఎత్తుగడ

మెగా డాటర్ నీహారిక నిర్మాతగా రూపొందిన కమిటీ కుర్రాళ్ళు ఈ నెల 9న విడుదల కానుంది. అయితే ప్రమోషన్ కు సంబంధించి భారం మొత్తం తనమీదే ఉండటంతో ఇంటర్వ్యూలు ఇస్తూ, పబ్లిసిటీ వ్యవహారాలు చూసుకుంటూ అంతా తానై వ్యవహరిస్తోంది. పదకొండు కొత్త కుర్రాళ్లతో రూపొందిన ఈ విలేజ్ డ్రామా మీద తగినంత బజ్ లేదు. సాయికుమార్, శ్రీలక్ష్మి లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో అంచనాలు తెచ్చేందుకు ఇది సరిపోవడం లేదు. ఇప్పుడు టీమ్ ముందున్న మార్గం స్పెషల్ ప్రీమియర్లు. దాని కోసం నీహారిక ఒక వినూత్న ఆలోచన చేసిందని సమాచారం.

బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలిచిన 21 నియోజకవర్గాల్లో ముందు రోజు స్పెషల్ షోలు వేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళ టీమ్ మధ్య సీరియస్ గా చర్చలో ఉందట. దీని వల్ల మెగా ఫ్యాన్స్ మద్దతుతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు సపోర్ట్ దక్కే ఛాన్స్ ఉంటుంది. సినిమా బాగుందని వాళ్ళు భావిస్తే చాలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో ఆటోమేటిక్ గా ఫ్రీ ప్రమోషన్ జరిగిపోతుంది. యదు వంశీ దర్శకత్వం వహించిన కమిటీ కుర్రాళ్ల ఈవెంట్ కి రామ్ చరణ్ లేదా చిరంజీవిని గెస్టుగా తీసుకొచ్చే ప్లాన్ కూడా నీహారిక వద్ద ఉందట.

అసలే ఈ సినిమాకు వారం రోజుల లైఫ్ ఉంటుంది. ఎందుకంటే అటుపై ఆగస్ట్ 15 భారీ రిలీజులున్నాయి. కమిటీ కుర్రాళ్ళకు థియేటర్లను నిలబెట్టుకోవడమే సవాల్ గా మారుతుంది. పైగా యూత్ నే టార్గెట్ చేసుకున్న మరో చిత్రం ఆయ్ కూడా బరిలో దిగుతోంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీలైనంత మొత్తం ఫస్ట్ వీక్ లోనే వసూలు చేసుకోవాలి. దీనికి ఏమేం చేయాలో, ఏమేం కావాలో అన్నీ చేస్తోంది నీహారిక. ఇది కనక హిట్ అయితే ప్రొడక్షన్ వైపు మరింత ఫోకస్ పెట్టి తక్కువ బడ్జెట్ లో కొత్త టాలెంట్ ని వెలికి తీసేలా మరిన్ని సినిమాలు తీసే విధంగా ప్లాన్ చేసుకుంటోంది. చూడాలి మరి రిజల్ట్ ఎలా వస్తుందో.