బాలీవుడ్ స్టార్ సినిమా.. దయనీయం


ఒకప్పుడు బాలీవుడ్‌ను రూల్ చేసిన పెద్ద పెద్ద స్టార్లు ఇప్పుడు దయనీయమైన స్థితిని ఎదుర్కొంటున్నారు. అక్షయ్ కుమార్ సంగతే తీసుకుంటే.. ఒక దశలో ఖాన్ త్రయానికి అతను దీటుగా నిలబడ్డాడు. నిలకడగా హిట్లు కొట్టాడు. కానీ ఇప్పుడు ఓ మోస్తరు విజయం కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు. కరోనా తర్వాత అక్షయ్ ప్రేక్షకులతో డిస్కనెక్ట్ అయిపోతున్నాడు. వరుసగా 16 ఫెయిల్యూర్లు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్ ‘సర్ఫీరా’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదు.

ఇప్పుడు అజయ్ దేవగణ్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఆయనకు కూడా కొన్నేళ్ల నుంచి సరైన విజయాలు లేవు. ఈ ఏడాది ‘మైదాన్’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు రాలేదు. దాంతో పోలిస్తే అజయ్ కొత్త చిత్రం ‘ఆరో మే కహా దమ్ తా’ చిత్రం పరిస్థితి ఘోరంగా ఉంది.

స్పెషల్ చబ్బీస్, బేబీ, ఎం.ఎస్.ధోని లాంటి సెన్సేషనల్ మూవీస్ తీసిన నీరజ్ పాండే రూపొందించిన చిత్రమిది. అజయ్‌తో పాటు టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రానికి మినిమం బజ్ లేదు. శుక్రవారం ఈ చిత్రం రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు పట్టట్లేదు. బాలీవుడ్లో పెద్ద మాస్ హీరోగా పేరున్న అజయ్ చిత్రానికి ఇంత లో బజ్ ఎప్పుడూ లేదు.

‘సర్ఫీరా’ చిత్రానికి కేవలం రెండు కోట్ల ఓపెనింగ్స్ రాగా.. ‘ఆరో మే కహా దమ్ తా’ కూడా దాదాపుగా అదే స్థాయిలో ఆరంభ వసూళ్లు తెచ్చుకునేలా ఉంది. ఈ సినిమా ట్రైలర్ సహా ఏ ప్రోమో పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. నీరజ్ పాండే ఫాంలో లేని విషయం అక్కడే అర్థమైపోయింది. అయినా సరే.. అజయ్ కోసమైనా జనం ఆసక్తి చూపిస్తారనుకుంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. సినిమా టాక్ ఎలా ఉన్నా.. ఇది డిజాస్టర్ కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ముందే ఒక అంచనాకు వచ్చేశాయి.