శాస్త్రిగారు తిట్టిపోసిన కృష్ణవంశీ సినిమా

ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే ఇది తీయకపోయి ఉంటే బాగుండేదనే డిజాస్టర్లు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటి తరంలో రాజమౌళి, నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడిలాంటి ఇద్దరు ముగ్గురిని మినహాయించవచ్చు కానీ శంకర్ తో సహా ప్రతి ఒక్కరికి చేదు జ్ఞాపకాలు అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటాయి. క్రియేటివ్ డైరెక్టర్ కృషవంశీకీ ఇది అనుభవమే. గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళిగా రూపొందించిన ఒక ఇంటర్వ్యూ సిరీస్ లో ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. వాటిలో పలు హిట్లు ఫ్లాపుల గురించిన ముచ్చట్లు ఉన్నాయి.

సీతారామశాస్త్రి గారు గోపీచంద్ హీరోగా వచ్చిన మొగుడు చూశాక కృషవంశీతో అన్న మాట నిన్ను ఎవరైనా ఈ సినిమా తీయమని బ్రతిమలారా అని. అంటే బలవంతంగా తీసి ప్రేక్షకుల మీదకు రుద్దాలనే ప్రయత్నం తప్ప అందులో ఏం లేదని చెప్పడమే గురువు గారి ఉద్దేశం. సిందూరం, మురారి, నిన్నే పెళ్లాడతా లాంటివి ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పిన శాస్త్రి గారే మొగుడు లాంటివి దారుణంగా ఉన్నాయని మొహం మీద చెప్పేవారట. నిజమే. మంచి ఆర్టిస్టులు సైతం ఓవరాక్షన్ చేసినట్టు అనిపించే మొగుడు రిలీజైన టైంలో సోషల్ మీడియా అంతగా లేదు కానీ లేదంటే ట్రోలింగ్ పీక్స్ లో ఉండేది.

ముఖ్యంగా రాజేంద్రప్రసాద్, రోజా, తాప్సీ, నరేష్, గోపీచంద్ పరస్పరం చెంపదెబ్బలు వాయించుకునే సీన్ ఒక్కటి చాలు మొగుడులో ఎంత ట్రోల్ మెటీరియల్ ఉందో చెప్పడానికి. ఆ మధ్య రంగమార్తాండ తీశాక కృష్ణవంశీ మళ్ళీ బ్రేక్ తీసుకున్నారు. దాని ఫలితం కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడంతో మరో కొత్త ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందే ప్రకటించిన అన్నం ఏమైందో కూడా అప్డేట్ లేదు. గులాబీతో పరిచయమై మూవీ లవర్స్ లో ఒకరకమైన కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న కృష్ణవంశీ కంబ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆయన కల్ట్ క్లాసిక్ మురారి ఆగస్ట్ 9 రీ రిలీజ్ కానుంది.