ఓజి సూత్రం నిదానమే ప్రధానం

పవన్ కళ్యాణ్ ఓజి విడుదల వాయిదా పడే విషయంలో మెల్లగా మబ్బులు వీడుతున్నాయి. ముందు ప్రకటించిన సెప్టెంబర్ 27 రావడం దాదాపు లేనట్టే. నిర్మాత నాగవంశీ తన లక్కీ భాస్కర్ ని అదే డేట్ కి లాక్ చేసుకోవడంతో అనుమానం తీరినట్టయ్యింది. ఒకవేళ అక్టోబర్ 10 కాకుండా దేవరను ముందే తేవాలి అనుకుంటే అప్పుడు ఓజి తేదీని జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చేస్తారు. ఏపీ తెలంగాణ హక్కులు తీసుకునేది నాగవంశీనే కాబట్టి దుల్కర్ సల్మాన్ మూవీని మళ్ళీ జరపడం పెద్ద సమస్య కాదు. ఇదంతా ఒక కొలిక్కి రావాలంటే రెండు మూడు వారాలు పట్టేలా ఉంది. కొంచెం ఓపిక పట్టక తప్పదు.

ఈ నేపథ్యంలో ఓజి దర్శక నిర్మాతలు నిదానమే ప్రధానం సూత్రం పాటించాలని నిర్ణయించుకున్నారట. అదెందుకో చూద్దాం. ఏపీలో పవన్ కళ్యాణ్ గెలుపుతో పాటు కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కొన్నివారాల పాటు పవన్ రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉంటాడు. తను పదవి తీసుకున్నా తీసుకోకపోయినా పార్టీలోని కీలక వ్యక్తులకు ప్రాధాన్యం దక్కేలా చూసుకోవాల్సిన బాధ్యత తన మీదుంది. పైగా ప్రజలకు జనసేన తరఫున హామీగా నిలబడేది వాళ్లే కాబట్టి ఈ కూర్పు జాగ్రత్తగా జరగాలి. ఆషామాషీగా షూటింగ్ స్పాట్లలో తీసుకునే నిర్ణయాలు కావివి.

అందుకే తొందరపడి పరుగులు పెట్టే బదులు స్లో అండ్ స్టడీ పాటించడమే సుఖమనే నిర్ణయానికి రావడం మంచిదే. ఓజి ఇంకా ఓటిటి డీల్ ఫైనల్ కాలేదనే టాక్ ఉంది. సెప్టెంబర్ ఎలాగూ వదులుకోవాలి కాబట్టి జనవరి దాకా మళ్ళీ స్లాట్లు ఖాళీ లేవు. ఇప్పుడు హడావిడి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ మీద ప్రభావం పడుతుంది. ఈ కారణంగానే దర్శకుడు సుజిత్, నిర్మాత దానయ్యలు అయిష్టంగానే వాయిదా వైపు మొగ్గు చూపారట . ఇదంతా స్పష్టంగా ముందే గుర్తించిన ఏఏం రత్నం తన హరిహర వీరమల్లుని 2024లోనే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఆ మేరకు పనులు కూడా మొదలైపోయాయి.