సుశాంత్ కేసు.. భాజపా ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెంది మూడు నెలలు దాటింది. ముందు అతడిది ఆత్మహత్యగానే భావించారు. కానీ తర్వాత తర్వాత అనేకానేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడిది హత్య అని కొందరు, బాలీవుడ్లో ఓ వర్గం అతడిని ఒత్తిడిలోకి నెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించిందని ఇంకొందరు ఆరోపణలు గుప్పించారు. అతడి కేసు విచారణ కూడా పలు మలుపులు తిరిగింది.

కాగా మహారాష్ట్రకు చెందిన భాజపా ఎమ్మెల్యే నితీష్ రాణె.. రిపబ్లిక్ టీవీ ఛానెల్లో చర్చ సందర్భంగా సుశాంత్, అతడి మేనేజర్ దిశల మృతికి సంబంధించి సంచలన ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరివీ ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు కావని, అవి హత్యలే అని.. అందుకే తన దగ్గర రుజువులు కూడా ఉన్నాయని.. ప్రస్తుతం సుశాంత్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను కూడా కలిసి ఆ ఆధారాలు సమర్పిస్తానని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

జూన్ 8న సుశాంత్ మేనేజర్ అయిన దిశ ఆత్మహత్యకు పాల్పడిందని.. కానీ దాని కంటే ముందు ఆమె తనకు ఇష్టం లేకుండా ఒక పార్టీలో పాల్గొందని.. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైందని.. దీని గురించి సుశాంత్‌కు ఫోన్ చేసిందని.. అతను రియాకు విషయం చెప్పాడని.. ఆమె దిశను ఇబ్బంది పెట్టిన వ్యక్తులకు ఫోన్ చేసి అంతా వివరించడంతో దిశ తన ఫ్లాట్‌కు వచ్చేసరికి ఓ వ్యక్తి తన కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడని.. ఆ వ్యక్తే ఆమె మరణానికి కారణం అయ్యాడని నితీష్ రాణె ఆరోపించాడు.

ఇదంతా జరిగిన రోజే రియా.. సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. తర్వాత ఐదు రోజులకే సుశాంత్ మరణించాడని, అతడి మృతి వెనుక కూడా కొన్ని శక్తులు పని చేశాయని ఆరోపణ చేశాడు రాణె. సుశాంత్ బాయ్ ఫ్రెండ్ అయిన రోహన్ రాయ్‌తో తాను మాట్లాడానని.. తనపై విపరీతమైన ఒత్తిడి ఉందని అతను తనతో చెప్పాడని టీవీ చర్చలో రాణె తెలిపాడు. సీబీఐ అధికారులు వెంటనే రోహన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని రాణె అన్నాడు.