షోలు క్యాన్సిల్‌.. రిలీజ్‌లు వాయిదా

వేసవి అంటే సినిమాలకు బాగా కలిసొచ్చే సీజన్ అని పేరు. ఈ టైంలో క్రేజీ సినిమాలు రిలీజవుతుంటాయి. థియేటర్లు కళకళలాడుతుంటాయి. కానీ కొన్నేళ్లుగా వేసవి సీజన్లు టాలీవుడ్‌కు పెద్దగా కలిసి రావడం లేదు. కరోనా టైంలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. గత ఏడాది పెద్ద సినిమాలు లేక సమ్మర్ సీజన్ కళ తప్పింది. ఇప్పుడు చూస్తే 2023 వేసవే చాలా బెటర్ అనిపిస్తోంది.

ఈసారి అసలే పెద్ద సినిమాలు లేవు. పైగా ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ పీక్స్‌లో నడుస్తోంది. ఇవి చాలవన్నట్లు ఎన్నికల హడావుడి నడుస్తోంది. జనాలంతా అందులో మునిగిపోయి సినిమా ఎంటర్టైన్మెంట్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటోంది.

ఈ వారం ఏం సినిమాలు రిలీజయ్యాయో కూడా జనాలు పట్టించుకోవడం లేదు. ‘పారిజాత పర్వం’ సహా ఏవో కొన్ని చిన్నా చితకా సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో వేటికీ మినిమం ఆక్యుపెన్సీలు లేవు. ‘పారిజాత పర్వం’ మూవీకి మార్నింగ్ షోలకు థియేటర్లో పది మంది అయినా కనిపించారు కానీ.. మిగతా సినిమాలకు ఆ మాత్రం కూడా టికెట్లు తెగలేదు. ‘పారిజాత పర్వం’ పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో రెండో షోల నుంచి ఆ మాత్రం జనం కూడా లేదు. దీంతో చాలా థియేటర్లలో మినిమం ఆక్యుపెన్సీలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి.

ముందు వారంలో వచ్చిన సినిమాల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. ‘టిల్లు స్క్వేర్’, ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓ మాదిరిగా ఆడుతున్నాయి. మరోవైపు బాక్సాఫీస్ గడ్డు పరిస్థితులు చూశాక ఒక్కొక్కటిగా సినిమాలను వాయిదా వేసేస్తున్నారు. శశివదనే, లవ్ మి లాంటి చిత్రాలు వెనక్కి వెళ్లిపోయాయి. తమిళ అనువాద చిత్రం ‘బాక్’ సైతం వాయిదా పడింది. ఏపీ, తెలంగాణల్లో ఎన్నికలు అయ్యేదాకా ఈ బాక్సాఫీస్ స్లంప్ కొనసాగేలాగే కనిపిస్తోంది.