రాశి ఖన్నా ఈ పరీక్షలో పాసవ్వాలి

ఒకప్పడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రాశి ఖన్నాకు ఈ మధ్య టైం కలిసి రాక వరస డిజాస్టర్లు మార్కెట్ ని దెబ్బ తీశాయి. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్ యులో స్టార్ హీరోల సరసన చేసినప్పటికీ వాటి ఫలితాలు దారుణంగా వచ్చాయి. రిజల్ట్స్ లో తన తప్పేమీ లేకపోయినా సక్సెస్ ని మాత్రమే కొలిచే ఇండస్ట్రీలో హిట్లున్నప్పుడే తలుపులు తడతారు. అయితే ధనుష్ తో తిరు మంచి విజయం సాధించడం రాశి ఖన్నాకు కొంత ఊరట కలిగించింది. కార్తీ సర్దార్ కూడా బాగానే ఆడటంతో తమిళంలో బిజీ అవుతుందనుకుంటే హిందీలో అవకాశాలు వస్తున్నాయి.

ఇవాళ బాలీవుడ్ మూవీ యోధ రిలీజవుతుంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామాకు భారీ బజ్ లేదు కానీ అడ్వాన్స్ బుకింగ్స్ డీసెంట్ గానే జరిగాయి. దీని కోసం రాశిఖన్నా ప్రత్యేకంగా ముంబై, ఢిల్లీ వెళ్లి విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొంది. 14 సంవత్సరాల తర్వాత చేసిన హిందీ సినిమా కావడంతో స్పెషల్ గా ఫీలవుతోంది. 2013లో తెరంగేట్రం జరిగిన మద్రాస్ కేఫ్ తర్వాత అదే సమయంలో తెలుగులో ఊహలు గుసగుసలాడే హిట్టు కొట్టడంతో మళ్ళీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. మధ్యలో వెబ్ సిరీస్ చేసింది కానీ థియేటర్ కంటెంట్ మాత్రం యోధనే.

ఇది సక్సెస్ అయితే కెరీర్ తిరిగి ఊపందుకుంటుందనే నమ్మకంతో ఉంది. ఇది కాకుండా నెక్స్ట్ ది శబర్ మతి రిపోర్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కోలీవుడ్ దర్శకుడు సి సుందర్ తీస్తున్న హారర్ కామెడీ అరణ్మయి(అంతఃపురం) 4లో తమన్నాతో కలిసి అందాలతో పాటు భయాలను పంచుకుంటోంది. తమిళ చిత్రం మేథావి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సీనియారిటీ ఎంత వచ్చినా సరే చాలా బిజీగా ఉంటున్న నయనతార, త్రిష లాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్న రాశిఖన్నాకు యోధ కనక విజయం అందిస్తే బ్రేక్ దొరికినట్టే. ఇంకొద్ది గంటల్లో అదేంటో స్పష్టంగా తెలిసిపోతుంది.