భగత్ సింగ్ ప్లానింగ్ తారుమారు కానుందా

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు కాగానే పవన్ కళ్యాణ్ వెంటనే షూటింగుల్లో అడుగు పెట్టాల్సి ఉంటుంది. టిడిపి జనసేన బిజెపి పొత్తు కనక అధికారంలోకి వస్తే ఒక నెల రోజులు ఆ హడావిడిలో బిజీగా ఉండొచ్చేమో కానీ కనీసం జూన్ నుంచి ఓజి కోసం వరుసగా డేట్లు ఇవ్వాల్సిందే. ఆ మేరకు దర్శకుడు సుజిత్ సర్వం సిద్ధం చేసుకుని ఉన్నాడు. సెప్టెంబర్ 27 విడుదల ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనేది నిర్మాత డివివి దానయ్య లక్ష్యం. అభిమానుల్లో ఉన్న అంచనాలు దృష్టిలో పెట్టుకుని ప్యాన్ ఇండియా ప్రమోషన్లను రెడీ చేస్తారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వద్దాం.

తమిళ బ్లాక్ బస్టర్ తేరి మూలకథను తీసుకుని హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న ఈ పోలీస్ డ్రామా షూటింగ్ కొంత భాగం జరిగాక బ్రేక్ పడింది. ఇది బాగా లేట్ అవుతుందని అర్థమైపోవడంతో ఇతను చక్కగా రవితేజ మిస్టర్ బచ్చన్ ని లాక్ చేసుకుని పరుగులు పెట్టిస్తున్నాడు. ఎంతలేదన్నా మే లేదా జూన్ లో గుమ్మడికాయ కొట్టేస్తారు. దీన్ని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చిరంజీవి ఇదే హరీష్ శంకర్ కాంబోలో ప్రాజెక్టు లాక్ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. సుష్మిత కొణిదెల భాగస్వామిగా దాదాపు కన్ఫర్మ్ అయ్యిందని మెగా కాంపౌండ్ లో వినిపిస్తున్న మాట.

ఒకవేళ ఇదే నిజమైతే ఉస్తాద్ భగత్ సింగ్ కు పెద్ద బ్రేకులు పడ్డట్టే. ఎందుకంటే విశ్వంభర మహా అయితే ఆగస్ట్ లోగా అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం పడుతుంది. జనవరి దాకా చిరంజీవి ఖాళీగా ఉండలేరు కాబట్టి ఆలోగా హరీష్ శంకర్ ది ఫినిష్ చేయొచ్చు. పవన్ ఓజి అయిపోగొట్టేసి ఆ హరిహర వీరమల్లు సంగతి చూడొచ్చు. ఈ లెక్కన ఉస్తాద్ భగత్ సింగ్ 2025లో తప్ప అంతకు ముందు కంటిన్యూ అయ్యే ఛాన్స్ లేనట్టే. ఇంకా శ్రీలీల కొత్త డేట్లు తీసుకోలేదు. మెయిన్ విలన్ ఎవరో లాక్ చేయలేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటల పని ఉంది. ఇవన్నీ చూస్తే భగత్ సింగ్ ఫ్యాన్స్ కు లాంగ్ వెయిటింగ్ తప్పదు.