ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు ఆలోచనలు

ఇంకా డేట్ చెప్పలేదు కానీ రాజమౌళితో చేయబోయే ప్యాన్ వరల్డ్ మూవీ కోసం మహేష్ బాబు సన్నద్ధమవుతున్నాడు. ఎంతలేదన్నా కనీసం రెండేళ్లు నిర్మాణానికి పడుతుంది కాబట్టి ఆ గ్యాప్ ఫ్యాన్స్ కోణంలో చూసుకుంటే చాలా పెద్దది. మధ్యలో వాళ్ళను కలుసుకోవడానికి నో ఛాన్స్. ఫోటో షూట్ల ప్రసక్తే ఉండదు. జక్కన్న అస్సలు ఒప్పుకోడు. అందుకే రాబోయే నెల రెండు నెలల టైంలో ఏవైతే యాడ్ షూట్స్ చేయబోతున్నాడో ఆ స్పాట్స్ కి దగ్గరలో అభిమానులను కలుసుకునేలా మహేష్ టీమ్ ఏర్పాట్లు చేస్తోందని టాక్. అసోసియేషన్లకు ఆ మేరకు ప్రాధమిక సమాచారం అందింది.

మాములుగా ఏదైనా కొత్త సినిమా రిలీజ్ దగ్గరలో ఉన్నప్పుడు ఇలా చేయడం మహేష్ కు అలవాటే. కానీ గుంటూరు కారంకు సాధ్యపడలేదు. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఆ ఆనందంలో మీటయ్యేవాడేమో కానీ వసూళ్లు మినహాయిస్తే టాక్ మాత్రం యావరేజ్ గా మిగిలిపోవడంతో ఆ అసంతృప్తి వల్ల సక్సెస్ మీట్ కు సైతం సుముఖత చూపించలేదు. త్రివిక్రమే విడుదల తర్వాత మీడియా ముందుకు రానప్పుడే మ్యాటర్ ఏంటో అర్థమైపోయింది. అందుకే ఫ్యాన్స్ మనసులో ఉన్న లోటుని తీర్చేందుకు వందల సంఖ్యలో ఫోటోలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి.

జుత్తు నుంచి కాస్ట్యూమ్స్ వరకు మహేష్ పూర్తిగా మేకోవర్ కాబోతున్నాడు. ఫిజికల్ ఫిట్ నెస్ కు సంబంధించిన సెషన్లు కూడా మొదలైపోయాయట. స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇటీవలే నిర్మాతల్లో ఒకరైన గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వేసవిలో మొదలవ్వొచ్చని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి కన్నా ముందు మహేష్ ఇంకో తక్కువ బడ్జెట్ సినిమా ఏదైనా చేయొచ్చనే ప్రచారం జరిగింది కానీ అదంతా పుకారే. జక్కన్న ప్రాజెక్టు అయిపోయేవరకు కనీసం కొత్త కథలు సైతం వినే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడట. సో ఫ్యాన్స్ కి ఇకపై ఎస్ఎస్ఎంబి 29నే ప్రపంచం.