త్రివిక్రమ్ పేరు మళ్లీ మార్మోగబోతోందా?

టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఈ మధ్య నెగిటివ్ కారణాలతోనే ఎక్కువగా చర్చలోకి వస్తోంది. ఇటీవల తన స్థాయి తగ్గ సినిమాలు రాయట్లేదని, తీయట్లేదని ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది త్రివిక్రమ్ రచన అందించిన బ్రో సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక లేటెస్ట్ గా ఆయన దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం చిత్రం సంగతి తెలిసిందే. దర్శకుడిగా ఖలేజా లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పుడు కూడా ఆయన్ని పొగిడిన వాళ్లే ఎక్కువ. కానీ ‘గుంటూరు కారం’ విషయంలో దాదాపుగా ‘అజ్ఞాతవాసి’ టైంలో మాదిరే ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు మాటల మాంత్రికుడు.

నిజానికి గుంటూరు కారం.. అజ్ఞాతవాసి అంత పేలమవైన సినిమా ఏమీ కాదు. కాకపోతే కథ విషయంలో పెద్దగా కసరత్తు చేసిన ఫీలింగ్ కలగకపోవడం.. తీసిన కథనే మళ్లీ తీసి చుట్టేసినట్లు అనిపించడం.. మహేష్ లాంటి స్టార్‌ను సరిగా వాడుకోకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది.

దీంతో ‘గుంటూరు కారం’ రిలీజైన దగ్గర్నుంచి కొన్ని రోజుల పాటు త్రివిక్రమ్‌ను నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. అందరూ మహేష్ బాబు శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు అంటూ ఆయన్ని కొనియాడుతూనే త్రివిక్రమ్‌ను నిందించారు. సినిమాలోనే అనేక అంశాల విషయంలో త్రివిక్రమ్‌పై ట్రోలింగ్ జరిగింది. సినిమా థియేట్రికల్ రన్ ముగిసేవరకు ఇది కొనసాగింది. వెబ్ మీడియాలో సైతం త్రివిక్రమ్‌ మీద పెద్ద ఎత్తున నెగెటివ్ ఆర్టికల్స్ వచ్చాయి. ఈ విషయంలో త్రివిక్రమ్ కొంత హర్టయినట్లు కూడా వార్తలు వచ్చాయి. అందుకే ఆయన ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లు లాంటి వాటికి అందుబాటులో లేకుండా అమెరికా వెళ్లిపోయినట్లు కూడా గుసగుసలు వినిపించాయి.

కట్ చేస్తే.. ఇప్పుడు ‘గుంటూరు కారం’ డిజిటల్ రిలీజ్ గురించి అప్‌డేట్ వచ్చింది. థియేటర్లలో సినిమా అయిన నెల రోజులకు నెట్‌‌ఫ్లిక్స్‌లోకి సినిమా రాబోతోంది. అప్పుడు ఆల్రెడీ థియేటర్లలో సినిమా చూసిన వాళ్లకు కూడా.. కొత్త ప్రేక్షకులు సినిమా మీద దృష్టిసారిస్తారనడంలో సందేహం లేదు. అప్పుడు మరింత సూక్ష్మ దృష్టితో సినిమా చూసి.. త్రివిక్రమ్‌ను మరోసారి టార్గెట్ చేస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి ఈ నెల 9 నుంచి కొన్ని రోజుల పాటు మరోసారి త్రివిక్రమ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగడం ఖాయం.