ద్వాపర యుగం అంతంతో కల్కి ప్రారంభం

సలార్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాగా కల్కి 2898 ఏడి మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇది వర్తమానంలో జరిగే కథ కాదని యూనిట్ ఎప్పటికప్పుడు లీకులు ఇస్తూనే ఉంది కానీ స్టోరీకి సంబంధించిన ముఖ్యమైన క్లూస్ మాత్రం బయటికి రాలేదు. అయితే దర్శకుడు నాగ అశ్విన్ టీమ్ ఇస్తున్న సమాచారాన్ని డీ కోడ్ చేసుకుంటూ వెళ్తే ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో బయట పడుతున్నాయి. కల్కి మూలం 6000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం కృష్ణుడి మరణంతో ఎక్కడైతే ముగుస్తుందో అక్కడ ప్రభాస్ ప్రయాణం మొదలవుతుంది.

కలియుగ ప్రారంభంలో జరిగిన పరిణామాల మొదలుకుని ట్యాగ్ లైన్ లో ఉన్న 2898 వరకు లెక్క వేసుకుంటే మొత్తం ఆరు వేల సంవత్సరాలవుతాయి. అంటే గతానికి భవిష్యత్తుకి మధ్య ముడిపెడుతూ నాగ అశ్విన్ ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు. ఇందులో రామాయణ, మహాభారత ప్రస్తావనతో పాటు ఆ ఇతిహాసాలలోని ముఖ్యమైన పాత్రలను వాడుకునేలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ సెటప్ చేశారట. క్యామియోలుగా చెప్పబడుతున్న విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఏ ఎపిసోడ్ లో కనిపిస్తారో చూడాలి. ప్రపంచం ప్రమాదంలో పడినప్పుడు దేవుడు కల్కి అవతారంలో భూమికి వస్తాడనే పాయింట్ ని సూపర్ హీరో కాన్సెప్ట్ కి ముడిపెట్టినట్టు తెలిసింది.

కొన్ని లీకులే ఇంత విశ్లేషణకు దారి తీసినప్పుడు ఇక ట్రైలర్ వచ్చాక హైప్ అంతకంతా పెరగడం ఖాయం. దీపికా పదుకునే, దిశా పటానిలు మానవాతీత శక్తులున్న వాళ్ళుగా కనిపిస్తారని ఇంకో టాక్ ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ల తాలూకు డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. మే 9 విడుదలను లాక్ చేసుకున్న కల్కి 2989 ఏడి ఓవర్సీస్ లో థియేటర్ల కొరత కారణంగా ఏప్రిల్ చివరి వారంకి ప్రీ పోన్ కావొచ్చనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో కన్ఫర్మ్ కాలేదు. వైజయంతి బృందం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డేట్ మార్పు ఉండదని చెబుతోంది. ఫ్యాన్స్ కోరుకుంటున్నది అదే.