అన్న‌గారి అడుగు జాడ‌.. నాడు-నేడు-ఏనాడూ!

తెలుగు వారి ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక అన్న నంద‌మూరి తార‌క రామారావు. సినీ రంగంలోనే కాకుండా.. రాజ‌కీయంగా ఆయ‌న వేసిన అడుగులు… ఉభ‌యతార‌కంగా ఆయ‌న న‌డిచిన విధానం.. వంటివి నాడే కాదు.. నేడు కూడా ఆచ‌ర‌ణీయాలు అన‌డంలో ఎలంటి సందేహం లేదు.

ఎక్క‌డో ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని మారు మూల గ్రామం నిమ్మ‌కూరు నుంచి విజ‌య‌వాడ‌కు వ‌చ్చి.. సైకిల్‌ పై కాలేజీకి వెళ్లి చ‌దువుకున్న రామారావు.. అనే రైతు బిడ్డ త‌ద‌నంత‌ర కాలంలో ఒక జాతి మొత్తానికీ.. ఆద‌ర్శంగా నిలుస్తార‌ని.. ఒక జాతిని చైత‌న్య వంతం చేస్తార‌ని బ‌హుశ ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. కానీ, జ‌రిగింది.

నేడు అన్న‌గారు ఎన్టీఆర్ వ‌ర్ధంతి. 1996, జ‌న‌వ‌రి 18న ఆయ‌న హైద‌రాబాద్‌లోని నివాసంలో ప‌ర‌మ‌ప‌దించారు. ఆయ‌న వెళ్లిపోయి ఏళ్లు గ‌డిచినా.. ఇప్ప‌టికీ మ‌న మ‌ధ్యే.. మ‌న తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్న‌ట్టుగా ఉంటుంది. ఆయ‌న‌తో మ‌న బంధాన్ని.. మ‌న బాంధ‌వ్యాన్ని పెన‌వేసుకున్నట్టుగానే అనిపిస్తుంది. దీనికి కార‌ణం.. ఆయ‌న దూర‌దృష్టి. అన్నం లేక‌పోయినా.. బ్ర‌తకొచ్చుకానీ.. ఆత్మ గౌర‌వాన్ని మాత్రం చంపుకుని బ్ర‌తికేదేలేదు అని చైత‌న్య ర‌థం పై నిల‌బ‌డి చేసిన ప్ర‌సంగాలు నేటి త‌రానికి తెలియ‌క పోవ‌చ్చు. కానీ, ఆ వాక్కులు ఇప్ప‌టికీ.. ప‌రోక్షంగా వినిపిస్తూనే ఉంటాయి.

1983కు ముందు.. ఎన్టీఆర్ అంటే.. కేవ‌లం న‌టుడు మాత్ర‌మే. అది కూడా విశ్వ‌విఖ్యాత న‌టుడుగానే అంద‌రికీ తెలుసు. కానీ, త‌ర్వాత‌.. తెలుగు దేశం పేరుతో పార్టీని స్థాపించి 61 ఏళ్ల వ‌య‌సులో తెలుగు వారి ఆత్మాభిమానం.. ఆత్మ‌గౌర‌వం కోసం.. ఉద్య‌మించిన తీరు న‌భూతో అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. త‌నకంటూ.. రూపాయి జీతం మాత్ర‌మే తీసుకుని ప‌నిచేసిన తొలి ముఖ్య‌మంత్రి కూడా అన్న‌గారే కావ‌డం.. కేవ‌లం ఆరుమాసాల్లోనే అప్ర‌తిహ‌త విజ‌య విహారంతో అధికారంలోకి రావ‌డం.. అన్న‌గారికే సాధ్య‌మైంది.

నేడు ప్ర‌భుత్వాలు ప్ర‌వ‌చిస్తున్న మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం వంటి అనేక అంశాల‌ను ఆనాడే.. అన్న‌గారు అమ‌లు చేశారు. మ‌హిళ‌ల‌కు ఆస్తిలో స‌గ‌భాగం హ‌క్కును క‌ల్పించారు. బీసీల‌కు ప్రాధాన్యం పెంచి.. ప‌ద‌వులు అప్ప‌గించారు. అవినీతిపై కొర‌డా ఝ‌ళిపించి.. ఎక్క‌డా రూపాయి తీసుకోకుండానే ప‌ని జ‌రిగేలా ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ గావించారు. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో ఓడిపోతార‌ని, ఉద్యోగులే ఓడిస్తార‌ని తెలిసినా.. వెనుకంజ వేయ‌ని ల‌క్షణంతో ముందుకు సాగారు.

పేద‌ల‌కు రెండు రూపాయ‌ల‌కే కిలో బియ్యం ప‌థ‌కం తెచ్చినా.. క‌ర‌ణం-మున‌సుబు వ్య‌వ‌స్థ‌ల‌ను ర‌ద్దు చేసినా.. ప‌టేల్ ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ల‌కు తెర‌దించినా.. మ‌హిళ‌ల‌కు రాజ‌కీయాల్లో ప్రాధాన్యం ఇచ్చినా.. బీసీల‌ను వెలుగులోకి తెచ్చినా.. ఎక్క‌డా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఆయ‌న కోరుకోలేదు.. ప్ర‌జాభ్యున్న‌తినే కాంక్షించారు. అందుకే.. అన్న‌గారి అడుగు జాడ‌.. నాడు-నేడు-ఏనాడూ! అన్న రీతిలో చిర‌స్థాయిగా నిలిచిపోయింది.. తెలుగు యుగం.. తెలుగు నేల ఉన్నంత వ‌ర‌కు ఆయ‌న పేరు స్థిరంగా ఉండిపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.