గేమ్ ఛేంజర్ మౌనానికి కారణాలివే  

సంక్రాంతి వచ్చిందని ఎప్పుడో ఏడాది తర్వాత రిలీజయ్యే ప్యాన్ ఇండియా సినిమాలకు కూడా అప్డేట్లు, పోస్టర్లు వదులుతున్నారు కానీ గేమ్ ఛేంజర్ బృందం నిమ్మకు నీరెత్తనట్టు ఉందని మెగా ఫ్యాన్స్ కస్సుమంటున్నారు. టైటిల్ రివీల్ చేసి నెలలు గడిచిపోతున్నా ఇప్పటిదాకా చిన్న వీడియో కంటెంట్ రాలేదు. పోనీ ఇప్పుడు మంచి సందర్భం వచ్చిందని సంతోషపడితే దాన్ని కూడా వృథా చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు. దీపావళికి జరగండి జరగండి ఆడియో సింగల్ రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశాక చివరి నిమిషంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

అసలేం జరుగుతోందని కనుక్కునే ప్రయత్నం చేస్తే కొన్ని వివరాలు తెలిశాయి. మొదటిది ఉగాది నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాలని దిల్ రాజు టీమ్ నిర్ణయించుకుందట. అప్పటిదాకా ఎవరెంత మొత్తుకున్నా వినే సమస్య లేదని వినికిడి. రెండోది దర్శకుడు శంకర్ చరణ్ మూవీ షూట్ తో పాటు ఇండియన్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ కన్నా ముందు అది రిలీజ్ అవుతుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. టీజర్ కట్ ఈయనకు చెప్పకుండా ఎడిట్ చేయలేరు. సో ఎదురు చూడాలి. మూడోది సినిమా విడుదల అనుకున్న సెప్టెంబర్ ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే గేమ్ ఛేంజర్ నుంచి ఎలాంటి స్టఫ్ ఇవ్వడం లేదని సమాచారం. రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి బెంగళూరు వెళ్ళాడు. తను లేని సీన్లనే ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. కాస్త ఫ్రీ టైం దొరికాక టీజర్ పనులు చూస్తానని నిర్మాత దిల్ రాజుకి శంకర్ చెప్పినట్టు తెలిసింది. సో ఎదురు చూపులు కొనసాగించక తప్పదు. ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్న తమన్ ఆశలన్నీ గేమ్ ఛేంజర్ మీదే ఉన్నాయి. కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా ఇది నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాడు. సో గేమ్ కోసం వెయిటింగ్ చేయడం తప్ప చేయగలిగింది ఏమి లేదు.