మీనాక్షి చౌదరి అభిమానులు ఫీలయ్యారు

యూట్యూబ్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న గుంటూరు కారం ట్రైలర్ లో మీనాక్షి చౌదరిని కేవలం ఒక్క ఫ్రేమ్ లో చూపించి చిన్న డైలాగుతో సరిపెట్టడం ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మెయిన్ హీరోయిన్ కానప్పటికీ మంచి స్క్రీన్ స్పేస్ దొరికి ఉంటుందనే అంచనాలకు భిన్నంగా మరదలి పాత్రని త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా లిమిటెడ్ గా డిజైన్ చేసిన ఫీలింగ్ ఆ చిన్న వీడియోలోనే వచ్చేసింది. మావయ్యగా నటించిన జయరామ్ ని ఉద్దేశించి రమణ గురించి రెండు ముక్కలు మాట్లాడ్డం తప్పించి ఇంకెక్కడా తనను చూపించడం, హైలైట్ చేయడం జరగలేదు.

మహేష్ బాబు తర్వాత ఎక్కువ ఫోకస్ వచ్చింది శ్రీలీలకి. మరీ ప్రత్యేకంగా అనిపించకపోయినా ఉన్నంతలో మూడు షాట్లు, డాన్స్ బిట్, చిన్న డైలాగులు ఇలా బాగానే చూపించారు. గతంలో చెప్పినట్టు ఇందులో మీనాక్షి చౌదరికి మరీ ఎక్కువ లెన్త్ అయితే దొరకలేదు. పేరుకి మరదలి పాత్రే అయినా హీరోతో డ్యూయెట్లు, రొమాన్సులు గట్రా పెద్దగా ఉండవు. పాటల్లో సైతం ఒక గ్రూప్ డాన్స్ తప్ప విడిగా డ్యూయెట్ పడలేదట. కెరీర్ ప్రారంభంలో మీడియం రేంజ్ హీరోలతో చేసి ఇప్పుడు స్టార్ల సరసన ఆఫర్లు పడుతున్న మీనాక్షి చౌదరి గుంటూరు కారం మీద బోలెడు ఆశలు పెట్టుకుంది.

ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మీనాక్షి చేసిన పాత్రే గతంలో శ్రీలీలకు ఇచ్చారు. అప్పుడు అసలు హీరోయిన్ పూజా హెగ్డే. తర్వాత క్యాస్టింగ్ లో అనూహ్యమైన మార్పులు జరిగే ప్లేసులు అటుఇటు మారాయి. ఒకవేళ పూజా తప్పుకోక పోయి ఉంటే ఇప్పుడు మీనాక్షి మీద వచ్చే సింపతీ శ్రీలీల మీదకు వెళ్ళేది. సినిమా మొత్తం చూశాక పూర్తి క్లారిటీ వస్తుంది కానీ దానికింకా అయిదు రోజులు టైం ఉంది కాబట్టి అప్పటి దాకా వెయిట్ చేయాలి. ఇప్పటిదాకా త్రివిక్రమ్ తీసిన సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఎవరికి మరీ ఎక్కువ పేరు రాలేదు. అఆలో అనుపమ పరమేశ్వరన్ ని కొంతమేర మినహాయించవచ్చు.