మైత్రి అండతో హనుమాన్ మాస్టర్ ప్లాన్

విపరీతమైన పోటీ, వాయిదా వేసుకోమనే ఒత్తిడి మధ్య హనుమాన్ కు మైత్రి అండ దొరికేసింది. నైజామ్ హక్కులను సుమారు ఏడు కోట్ల ఇరవై లక్షలకు ఆ సంస్థ స్వంతం చేసుకున్నట్టు ట్రేడ్ టాక్. జనవరి 12 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఏవో చర్చలు, సంప్రదింపులని వార్తలు వస్తున్నాయి వాటి ఫలితం మాత్రం సున్నా. ఎవరూ పండగ బరి నుంచి తప్పుకోవడం లేదనే క్లారిటీ వచ్చేసింది. అదే ప్రాంతంలో గుంటూరు కారంని దిల్ రాజు పంపిణి చేస్తున్న నేపథ్యంలో థియేటర్ల పంపకాలకు సంబంధించిన పోటీ వాడివేడిగా, రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది.

హనుమాన్ ని ఎవరూ తక్కువంచనా వేయడం లేదు కానీ గుంటూరు కారం మాస్ ని తట్టుకుని నిలబడుతుందా అనేదే అసలు ప్రశ్న. అయితే నిర్మాతల వైపు నుంచి ఉన్న ధైర్యం వెనుక మరో కోణం ఉంది. ఈ సినిమా త్రీడి వెర్షన్ లో వస్తోంది. మొదటిసారి చూసినవాళ్లు ఖచ్చితంగా పిల్లలకు రికమండ్ చేసే స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని యూనిట్ ఊరిస్తోంది. ఈ నమ్మకంతోనే నార్త్ లో వెయ్యికి పైగా స్క్రీన్లతో పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకుంటోంది. పైగా మహేష్ మూవీకి మొదటి వారం అందరికీ అంత సులభంగా టికెట్లు దొరికే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఓవర్ ఫ్లోస్ మొదట ప్లసయ్యేది హనుమాన్ కే.

అగ్రిమెంట్లు, కేటాయింపులు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. మొదటి వారంలో షోలు తగ్గినా సెకండ్ వీక్ నుంచి అమాంతం పెరుగుతాయనే ధీమా హనుమాన్ మేకర్స్ లో ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. గుంటూరు కారం ట్రైలర్ వచ్చాక అంచనాల బరువులో అది ముందుకు వెళ్లిపోవడం ఖాయమే కానీ స్లో అండ్ స్టడీ సూత్రాన్నే నమ్ముతున్నాడు హనుమాన్. వచ్చే వారం నుంచి పబ్లిసిటీని వినూత్నంగా ప్లాన్ చేయబోతున్నారు. మహేష్, వెంకటేష్, రవితేజ, నాగార్జునల పోటీ తట్టుకోవాలంటే ఆ మాత్రం వైవిధ్యం చూపించక తప్పదు మరి.