డిజాస్టర్లున్నా పిలిచి ఛాన్సులిస్తున్నారు

మాములుగా హీరోయిన్లకు కెరీర్ నెమ్మదించి వరస ఫ్లాపులు పలకరించడం మొదలుపెట్టాక ఆఫర్లు తగ్గిపోతాయి. ఒకప్పుడు ఎంత పొడిచామన్నది కాదు ఇప్పుడెంత సక్సెస్ లో ఉన్నామనేదే ఇండస్ట్రీలో కీలకం. కొందరికి మాత్రం విచిత్రంగా అవకాశాల వెల్లువ కురుస్తూనే ఉంటుంది. అందులో కంగనా రౌనత్ పేరు ముందుగా ప్రస్తావించాలి. తాజాగా మాధవన్ సరసన ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందబోయే మల్టీ లాంగ్వేజ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. జివి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్న ఈ థ్రిల్లర్ డ్రామాకు స్వయానా సూపర్ స్టార్ రజనీకాంత్ పిలిచి మరీ ఆశీర్వచనం అందించారు.

కంగనా ట్రాక్ రికార్డు ఈ మధ్య మరీ దారుణంగా మారింది. ఇటీవలే విడుదలైన తేజస్ నిర్మాతను నిలువునా ముంచేసి ఆయన నెక్స్ట్ మూవీ పిప్పని నేరుగా ఓటిటి రిలీజ్ చేసేలా ప్రేరేపించింది. మంచి క్యాస్టింగ్, ఏఆర్ రెహమాన్ లాంటి క్రేజీ టెక్నికల్ టీమ్ ఉన్నా సరే అదంతా వృథా అయిపోయింది. దీనికన్నా ముందు ధాకడ్ ఇంకా ఘోరంగా పోయింది. కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదని విశ్లేషకులు ఎద్దేవా చేశారు. సరే చంద్రముఖి 2ని ఛాలెంజ్ గా తీసుకుని జ్యోతిక, శోభన, సౌందర్యలను మరిపిద్దామనుకుంటే దర్శకుడు పి వాసు అత్తెసరు దర్శకత్వం వల్ల ట్రోలింగ్ మిగిలింది.

రెండేళ్ల క్రితం తలైవితో పరాజయం చూసినప్పటి నుంచి కంగనాకు తమిళ దర్శకులు స్వాగతం చెబుతూనే ఉన్నారు. కారణం ఏంటో తెలియదు కానీ తనను ఎంచుకోవడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చేశాక మనోళ్లు బొత్తిగా పట్టించుకోవడం మానేశారు. టాలెంట్ ఉన్నా అందం విషయంలో కంగనా రూపం తెలుగు ఆడియన్స్ కి సూటవ్వదనే ఉద్దేశంతో దూరం పెట్టారు. కంగనా కొత్త మూవీ ఎమర్జెన్సీ వచ్చే వారం విడుదల కానుంది. ఇందిరా గాంధీ పాత్రను పోషించి పెద్ద రిస్కే చేసింది. ఇది ఏ మాత్రం తేడా కొట్టినా ఇక పూర్తిగా చెన్నైలో సెటిలవాల్సిందే.