కంగనాకు ఆ సినిమాలు కనిపించట్లేదా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏడాది ముందు వరకు ఎంత యారొగెంట్‌గా ఉండేదో అందరికీ తెలిసిందే. ‘క్వీన్’ సినిమా నుంచి తనకు హీరోలతో సమానంగా ఇమేజ్ రావడంతో ఒక దశలో ఆమెకు గర్వం తలకెక్కిన సంకేతాలు కనిపించాయి. ‘మణికర్ణిక’ టైంలో అది పీక్స్‌కు చేరింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఇక తనకు ఎదురు లేదు అనుకుంది. కానీ తర్వాత కంగనా సినిమా ఒక్కటీ విజయవంతం కాలేదు.

ఈ మధ్య ఆమె సినిమాలను ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు. ‘ధకడ్’, ‘తలైవి’, ‘చంద్రముఖి-2’.. ఇలా కంగనా ఏది ముట్టుకున్నా భస్మమే అన్నట్లుంది పరిస్థితి. తాజాగా కంగనా కొత్త చిత్రం ‘తేజస్’కు కనీస స్పందన కూడా లేదు. ఈ సినిమా రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియట్లేదు. బడ్జెట్ రికవరీ సంగతి పక్కన పెడితే.. రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తన సినిమాకు మరీ ఇంత దారుణమైన పరిస్థితి రావడం చూసి.. కంగనా వినమ్రంగా ప్రేక్షకులకు ఒక విన్నపం చేసింది. ప్రేక్షకులు థియేటర్లకు రావాలని కోరింది.

ఈ సందర్భంగా ఆమె ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేస్తున్నారంటూ మొత్తంగా సినీ పరిశ్రమ దుస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసింది. కొవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లు రావడం మానేస్తున్నారని.. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్, ఇంట్లో టీవీ ఉండటంతో థియేటర్లకు రావడం తగ్గిపోయిందని పేర్కొంది. జనాల మధ్య థియేటర్లో సినిమా చూడటంలో ఉన్న ఆనందం వేరు అని ఆమె అభిప్రాయపడింది. యురి, నీర్జా లాంటి సినిమాలు నచ్చితే.. ‘తేజస్’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని.. కాబట్టి థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరింది. కానీ కంగనా మాటల్లో ఏమాత్రం వాస్తవం ఉందనే చర్చ జరుగుతోంది. కొవిడ్ తర్వాత కొంత కాలం బాలీవుడ్ సినిమాలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. కానీ వాళ్లు అసలు ఏ సినిమానూ ఆదరించట్లేదనే మాట అవాస్తవం.

కొవిడ్ తర్వాతే పఠాన్, జవాన్, గదర్-2 సహా పలు బాలీవుడ్ సినిమాలు సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇక సౌత్ నుంచి వచ్చిన పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, కార్తికేయ-2, కాంతార లాంటి సినిమాలు ఉత్తరాదిన ఘనవిజయం సాధించాయి. ప్రేక్షకులు ఇప్పుడు థియేట్రికల్ వాల్యూ ఉన్న సినిమాలే పెద్ద తెరపై చూడాలనుకుంటున్నారు. వారి అభిరుచి మారింది. అది గుర్తించి వారి అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆటోమేటిగ్గా థియేటర్లకు వస్తారు. అది అర్థం చేసుకోకుండా ప్రేక్షకులు అసలు థియేటర్లకు రావడమే మానేశారనడం విడ్డూరం.