లోకేష్ నేర్వాల్సిన పాఠం

‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో లోకేష్ కనకరాజ్‌కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశంలో రాజమౌళి తర్వాత దర్శకుడిగా ఎక్కువ క్రేజ్ దక్కించుకున్నది లోకేషే అంటే అతిశయోక్తి కాదు. కేవలం అతడి పేరు చూసే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. తన కొత్త సినిమా ‘లియో’ దసరా సీజన్లో రెండు పెద్ద తెలుగు సినిమాలతో పోటీ పడుతూ వాటిని మంచి క్రేజ్ సంపాదించుకుందంటే అందుకు కారణం హీరో విజయ్ కాదు, దర్శకుడు లోకేష్ కనకరాజే.

ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఇంత క్యూరియాసిటీ ఏ సినిమా విషయంలోనూ చూపించలేదు. కానీ ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్‌కు నిరాశ తప్పలేదు. లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆడియన్స్.. ఈ విషయంలో బాగా నిరాశ పడ్డారు. ఏదో మొక్కుబడిగా ఎల్‌సీయూతో కనెక్షన్ కలిపాడే కానీ.. అందులో ఒరిజినాలిటీ కనిపించలేదు.

‘లియో’లో అసలు విషయం లేదా అంటే అదేమీ కాదు. ఒక ఎగ్జైటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ తీయడానికి తగ్గ సెటప్ కుదిరినా.. కథనంలో ఉత్కంఠ రేపే విషయాలు లేకపోవడం.. కేవలం పార్తిబన్ లియోనా కాదా అనే విషయం మీదే ఆరంభం నుంచి చివరి వరకు కథ నడవడం ప్రతికూలంగా మారింది. కథలో వేరే డైమన్షనే కనిపించకపోవడంతో ప్రేక్షకులకు విసుగు పుట్టింది. లోకేష్ ఏదో హడావుడిగా, మొక్కుబడిగా ఈ కథను లాగించేసినట్లు అనిపించిందే తప్ప ఇంటెన్సిటీ లేకపోయింది. ఏ పాత్ర కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సంజయ్ దత్, అర్జున్ లాంటి నటులను పూర్తిగా వేస్ట్ చేసేశాడు లోకేష్.

అతను ఇంకొంచెం టైం తీసుకుని ఈ పాత్రలను.. సినిమాలోని కీలక ఘట్టాలను ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా రాసుకుని, వాటికి తన మార్కు టేకింగ్ జోడించి ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. ఇంత నెగెటివ్ టాక్‌లోనూ ‘లియో’ బాగానే ఆడుతుండటం లోకేష్ పట్ల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా సినిమా రేంజే వేరుగా ఉండేది. ఇక ఖైదీ, విక్రమ్‌ల మాదిరి సినిమా పకడ్బందీగా ఉండి ఉంటే ఈ సినిమాకు ఆకాశమే హద్దు అయ్యేది. ‘విక్రమ్’ తీశాక ఏడాది వ్యవధిలోనే సినిమా తీసేసి రిలీజ్ చేసేయాలని టార్గెట్ పెట్టుకోవడం మైనస్ అయినట్లు కనిపిస్తోంది. ఈసారైన లోకేష్ హడావుడి పడకుండా.. రజినీ సినిమా మీద ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టి తీస్తే తన నుంచి మళ్లీ ఓ బ్లాక్‌బస్టర్ రావచ్చు.