కంగనా సినిమాను కొనేవాళ్లు లేరా?

కంగనా రనౌత్.. ఇండియాలో లేడీ ఓరియెంటెడ్ మూవీతో వంద కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి హీరోయిన్. ఆమె నటించిన ‘క్వీన్’ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఆ తర్వాత కూడా ‘మణికర్ణిక’ సహా కొన్ని హీరోయిన్ ప్రధాన చిత్రాలతో ఆమె సత్తా చాటింది. కానీ ‘మణికర్ణిక’ టైంలో ఆమె చేసిన అతి తర్వాతి కాలంలో తనకు శాపంలా మారింది. దర్శకుడు క్రిష్‌ను తప్పించి.. ఇష్టం వచ్చినట్లు రీషూట్లు చేసి చివరికి దర్శకురాలిగా తన పేరే వేసుకోవడం ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే.

తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటూ ఆ తర్వాత వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే చేసింది. అంతే కాక బాలీవుడ్‌లో అనేక మందిని ఆమె టార్గెట్ చేసింది. రాజకీయాల్లో కూడా వేలు పెట్టి బీజేపీ భజనపరురాలిగా మారి.. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసింది. ఇలా ఆమె ప్రవర్తన, మాటలు హద్దులు దాటడంతో జనాలకు కంగనా అంటేనే చిర్రెత్తుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఆ ప్రభావం తన సినిమాల మీద కూడా పడింది.

‘మణికర్ణిక’ తర్వాత కంగనా నటించిన ఒక్క సినిమా కూడా మినిమం ఇంపాక్ట్ చూపలేకపోయింది. హిందీలో ఆమె నటించిన ‘జడ్జిమెంటల్ హై క్యా’, పంగా, దాకడ్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. ‘దాకడ్’ అయితే వంద కోట్ల బడ్జెట్లో తెరకెక్కి అందులో ఐదు శాతం వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. ఇక దక్షిణాదిన ఆమె నటించిన తలైవి, చంద్రముఖి-2 కూడా డిజాస్టర్లే అయ్యాయి. దీంతో చూస్తుండగానే కంగనా మార్కెట్ కరిగిపోతూ వచ్చింది. ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలకు బయ్యర్లు లేని పరిస్థితి నెలకొంది.

ఎమర్జెన్సీ, తేజస్.. ఈ సినిమాలకు బిజినెస్ జరగని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ముఖ్యంగా కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ని ఒక ప్రాపగండా ఫిలిం లాగే చూస్తున్నారు జనం. దీని పట్ల ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి లేదు. సినిమాకు బిజినెస్ జరక్కపోవడం వల్ల ముందు ప్రకటించినట్లు నవంబరు 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోతున్నారు. సినిమాను వాయిదా వేస్తున్న విషయం మాత్రమే చెప్పిన కంగనా.. అందుకు కారణం చెప్పలేదు. కానీ బిజినెస్ కాకపోవడమే వాయిదాకు కారణమని అంటున్నారు.