ప్రభాస్ వెర్సస్ షారుఖ్.. సందేహాల్లేవు

ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’కు కొత్త డేట్ ఇచ్చినప్పటి నుంచి క్రిస్మస్‌ సీజన్లో జరగబోయే బాక్సాఫీస్ వార్ గురించి తెగ చర్చ జరుగుతోంది. అదే టైంలో షారుఖ్ ఖాన్ సినిమా ‘డుంకి’ కూడా రిలీజ్ కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ‘సలార్’కు భారీ హైప్ ఉన్న మాట వాస్తవమే అయినా.. ‘డుంకి’ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బ్లాక్‌బస్టర్లు తప్ప ఏమీ తీయని రాజ్ కుమార్ హిరాని డైరెక్ట్ చేస్తున్న సినిమా అది.

అందులోనూ షారుఖ్ వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన ఊపులో ఉన్నాడు. కాబట్టి ఆ చిత్రం వస్తే ‘సలార్’కూ ఇబ్బంది తప్పదు. అలా అని ‘సలార్’ లాంటి మెగా మాస్ మూవీని చూసి ‘డుంకి’ టీం కంగారు పడకుండా ఉండే పరిస్థితి కూడా లేదు. కానీ ‘డుంకి’ లాంటి క్లాస్ మూవీకే ఎక్కువ ప్రమాదం అనే అభిప్రాయాలున్నాయి. ఆల్రెడీ ఈ ఏడాది షారుఖ్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి కాబట్టి ‘డుంకి’ని వాయిదా వేయొచ్చనే చర్చ కూడా నడిచింది.

ఐతే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం కారణంగా చూపి ‘డుంకి’ని వాయిదా వేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ‘సలార్’కు లైన్ క్లియరైనట్లే అని భావించారంతా. కానీ ఈ వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ‘డుంకి’ టీంతో కన్ఫమ్ చేసుకుని ఈ విషయమై ట్వీట్ వేశారు. ‘డుంకి’ వాయిదా వార్తల్లో నిజం లేదని.. క్రిస్మస్‌కే ఆ సినిమా వస్తుందని టీం చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

‘జవాన్’ ఇంకా థియేటర్లలో ఉండగా.. ‘డుంకి’ గురించి అప్‌డేట్ ఇవ్వడం బాగోదని వెయిట్ చేస్తున్నట్లు టీం చెప్పిందట. మరోవైపు ‘డుంకి’ని ఓవర్సీస్‌లో రిలీజ్ చేయబోతున్న యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఎక్కడిక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్ల బుకింగ్ విషయంలో సమాచారం ఇచ్చిందని, త్వరలో బుకింగ్స్ కూడా మొదలుపెట్టుకోమని కూడా చెప్పేశారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి క్రిస్మస్‌కి ప్రభాస్ వెర్సస్ షారుఖ్ బాక్సాఫీస్ వార్ చూడబోతున్నట్లే.