జగపతిబాబుని బాధ పెట్టిన అభిమానులు

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి సినిమాలు చేసిన జగపతి బాబు లెజెండ్ నుంచి విలన్ గా మారిపోయి సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఆయన ఒకరు. సీనియర్ స్టార్ అయినా, మధ్య తరగతి బడ్జెట్ మూవీ అయినా స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటుడు కావాలంటే ఆయనే ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు. అలాంటి జగ్గు భాయ్ కి ఫ్యాన్స్ మీద కోపం వచ్చిందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. మాములుగా ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడే ఈ వర్సటైల్ యాక్టర్ కి అంత మనస్థాపం ఎందుకు కలిగిందో కానీ అభిమానులకు గుడ్ బై చెప్పేశారు.

ఆయన పోస్ట్ చేసిన లేఖ సారాంశం ఇలా ఉంది. “33 ఏళ్లుగా నా కుటుంబం శ్రేయోభిలాషుల్లాగా నా అభిమానులు కూడా నా పెరుగుదలకు ముఖ్య కారణంగా నిలిచారు. అలాగే వాళ్ళ ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ళ కష్టాన్ని నా కష్టాలుగా భావించి నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నేను నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం ప్రేమ ఇచ్చేవాళ్ళని నమ్మాను. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులు నా నుంచి ప్రేమకంటే ఆశించడం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెబుతున్న విషయం.

అదేమిటంటే ఇక నుంచి నేను నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్ లకు సంబంధం లేదు. వాటి నుంచి విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను”. సంఘటన తాలూకు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కానీ కొందరు ఫ్యాన్స్ స్వార్థబుద్ధితో వ్యవహరించి జగపతిబాబు మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ఆర్థిక లబ్ది పొందడానికి ప్రయత్నించడం వల్లే ఆయనకు మనస్థాపం కలిగిందని సన్నిహితులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ వయసులో జగపతిబాబుని బాధ పెట్టిన ఆ కొందరు  అభిమానులది ముమ్మాటికీ ప్రేమే కాదు.