దృశ్యంని తిప్పి తీసి బోల్తా పడ్డారు

ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన కరీనా కపూర్ ప్రియుడు సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకున్నాక పెద్ద బ్రేక్ తీసుకుంది. పిల్లలు పుట్టాక అడపాదడపా ఒకటి రెండు చేసింది కానీ అవేవి ఆశించిన ఫలితం అందుకోలేదు. తాజాగా జానే జాన్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మొన్న శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కహాని, బదలా లాంటి అద్భుతమైన మర్డర్ మిస్టరీస్ ఇచ్చిన సుజయ్ ఘోష్ దర్శకుడు కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ తీరా చూస్తే కరీనాకు ఇది మంచి తెరంగేట్రంగా నిలవడం కష్టమే అనిపిస్తోంది.

కథగా చూస్తే ఇది దృశ్యంని తిప్పి తీసినట్టు అనిపిస్తుంది. సుదూర హిల్ స్టేషన్ లో ఒక్కగానొక్క కూతురుని చదివించుకుంటూ హోటల్ నడుపుతూ ఉంటుంది మాయ(కరీనా కపూర్). చాలా ఏళ్ళ తర్వాత దుర్మార్గుడైన భర్త అజిత్(సౌరభ్ సచ్ దేవ్)తిరిగి వస్తాడు. స్వంత కూతురిని తప్పుడు బుద్దితో చూడటంతో బిడ్డతో కలిసి మాయ అతన్ని చంపేస్తుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కరణ్(విజయ్ వర్మ)కు బోలెడు చిక్కుముడులు ఎదురవుతాయి. మాయ పక్కింట్లో ఉండే టీచర్ నరూ(జయదీప్)కు ఈ నేరంతో సంబంధం ఉంటుంది. అసలు స్టోరీ ఇంకా వేరే ఉంది.

లైన్ పరంగా దృశ్యంకు దగ్గరగా ఉండటం ఈ జానే జాన్ కున్న పెద్ద మైనస్. సుజయ్ ఘోష్ స్క్రీన్ ప్లే అతని మునుపటి స్థాయిలో లేకపోవడం నిరాశపరుస్తుంది. సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. కరీనా అందం తగ్గిపోయి మరీ బేలగా నటించి నిరాశ కలిగిస్తే విజయ్ వర్మ, జయదీప్ లు ఆకట్టుకుంటారు. చాలా ఓపిగ్గా చూస్తే తప్ప కనెక్ట్ కాలేనంత వీక్ గా కథనం సాగడంతో గ్రిప్పింగ్ ఫాక్టర్ జీరో అయిపోయింది. పైగా క్లైమాక్స్ కూడా షాకింగ్ గా అనిపించకపోవడం లోపమే. రెండు గంటల పదిహేను నిమిషాల సాగతీతను భరించడం కంటే దృశ్యంనే రీ షో వేసుకుని చూసుకోవడం ఉత్తమమైన పని.