మేడమ్ టుస్సాడ్స్‌కు బన్నీ

Allu Arjun
Allu Arjun

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం కలిగి ఉండటం గొప్ప గౌరవం. ఇండియన్ సినిమాకు సంబంధించి ఎప్పుడూ బాలీవుడ్ తారలకు మాత్రమే ఇక్కడ చోటు దక్కేది. సౌత్ ఇండియన్ సెలబ్రెటీలను ఇందుకు పరిగణనలోకే తీసుకునే వారు కాదు. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితి మారింది. సౌత్ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా గ్లోబల్ లెవెల్లో గొప్ప పేరు సంపాదించాక మన వాళ్లకూ ఆ మ్యూజియంలో అవకాశం దక్కుతోంది.

ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబుల మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్‌లో అడుగు పెట్టాయి. అల్లు అర్జున్ సైతం ఈ మ్యూజియంలో అవకాశం దక్కించుకున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందుకు సన్నాహాలు మొదలయ్యాయి. బన్నీ తన మైనపు విగ్రహానికి కొలతలు ఇచ్చేందుకు ఇక్కడ్నుంచి బయల్దేరుతున్నాడు.

లండన్‌లోని మేడం టుస్సాడ్స్‌కే వెళ్లి బన్నీ తన విగ్రహం కోసం కొలతలు ఇవ్వబోతున్నాడు. ఇందుకోసం అతను ‘పుష్ప-2’ షూట్ నుంచి కూడా బ్రేక్ తీసుకుంటున్నాడు. మరో రెండు రోజుల్లో బన్నీ లండన్ బయల్దేరుతున్నట్లు సమాచారం. రెండు రోజులు అక్కడే ఉండి ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని బన్నీ ఇండియాకు తిరిగి వస్తాడు. విగ్రహం వచ్చే ఏడాది ఆవిష్కృతం కావచ్చని సమాచారం.

ఇటీవలే బన్నీ ‘పుష్ప’ చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకోవడంతో అతడి పాపులారిటీ మరింత పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా అతను ఎదిగాడు. అతను నటిస్తున్న ‘పుష్ప-2’ మీద అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా రిలీజ్ తర్వాత బన్నీ రేంజ్ ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. ‘పుష్ప-2’ విడుదలయ్యే సమయానికి టుస్సాడ్స్‌లో బన్నీ విగ్రహం కూడా ఆవిష్కృతం అయితే తన పాపులారిటీ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.