18 నెలల నిరీక్షణకు యష్ ముగింపు

ఊహించిన దానికన్నా చాలా పెద్ద స్థాయిలో కెజిఎఫ్ తో ప్యాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్న శాండల్ వుడ్ హీరో యష్ దాని దెబ్బకే కొత్త సినిమా విషయంలో విపరీతమైన జాప్యం చేయాల్సి వచ్చింది. కాంబినేషన్లకు టెంప్ట్ అయిపోయి తొందపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇతర బాషల స్టార్లను చూసి అర్థం చేసుకుని చాలా మెల్లగా అడుగులు వేస్తున్నాడు. కెజిఎఫ్ 2 రిలీజై ఏడాది దాటుతున్నా ఇప్పటిదాకా కొత్త అనౌన్స్ మెంట్ రాకపోవడం పట్ల అభిమానులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇంకెంత కాలం వెయిట్ చేయాలని సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు ఈ సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ పడనుంది. యష్ 19 డిసెంబర్ మూడో వారంలో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు బెంగళూరు న్యూస్. గోవాలో జరిగే డ్రగ్ మాఫియా రాకెట్ చుట్టూ ఈ కథ నడుస్తుందని ఇన్ సైడ్ టాక్. దీని కోసమే యష్ కొన్ని నెలల క్రితం ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు గన్ షూటింగ్ తదితర వాటిలో ప్రత్యేక శిక్షణ పొందాడు. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న అవార్డు విన్నింగ్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ డ్రామా రూపొందనుంది. తన శైలికి భిన్నంగా కమర్షియల్ జానర్ లో కథ రాసుకున్నారట.

దీనికి సంబంధించి అప్డేట్స్ ని నవంబర్ నుంచి ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ తప్ప వేరొకటి ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎంత ఆలస్యమవుతున్నా సరే యష్ పర్ఫెక్షన్ కోసమే ఇంత కాలం ఆగినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. బాలీవుడ్ నుంచి రామాయణం ఆఫర్ వచ్చినప్పటికీ దాని పట్ల అంత సుముఖంగా లేడని వినికిడి. రెగ్యులర్ స్టార్ల ఆలోచనలకు భిన్నంగా గీతూ మోహన్ దాస్ ని ఎంచుకున్న యష్ కెజిఎఫ్ ని మించిన సక్సెస్ ని కొట్టాలనే పంతంతో ఉన్నాడు. రాఖీ భాయ్ ని ఆవిడ ఎలా చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. లెట్ సీ.