కోటి రూపాయలు కట్టండి.. ఈటీవీ ఆగ్రహం

ఈ మధ్యే నెట్ ఫ్లిక్స్‌ ద్వారా నేరుగా డిజిటల్లో రిలీజైంది ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా. ఆ చిత్రానికి మంచి రివ్యూలే వచ్చాయి. ప్రేక్షకుల స్పందన కూడా బాగుంది. పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ఈటీవీ వాళ్లు కొనుక్కున్నారు. ఆ డీల్ రూ.2.5 కోట్లని తెలుస్తోంది. అది సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తం అంటున్నారు.

కొత్త సినిమాల శాటిలైట్ హక్కులను ఈటీవీ కొనడం తక్కువ. ఇదేదో చిన్న సినిమా కావడంతో తమకు రీజనబుల్ అనిపించిన ప్రైస్ పెట్టి సినిమా కొన్నారు. త్వరలోనే ఈటీవీలో ప్రిమియర్ వేయాలనుకుంటున్నారు. కాగా హైదరాబాద్‌లోని ఓ కేబుల్ ఛానెల్ ఈ సినిమాను నేరుగా తమ ఛానెల్లో వేసేసింది. ఈ విషయం ఈటీవీ వాళ్ల దృష్టికి వెళ్లి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలంటూ నోటీసు పంపడం గమనార్హం.

కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్ హక్కులు కొంటే.. తెలుగు సినిమాలకు ఎంతో రీచ్ ఉన్న హైదరాబాద్‌లో కేబుల్ టీవీలో సినిమా వేసేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఈ వ్యవహారం సీరియస్ అయి.. ఆ కేబుల్ టీవీ యజమాని ఈటీవీ వాళ్లను శరణుజొచ్చారట. ఆ కేబుల్ టీవీలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ప్రసారం అవుతోందని ఈటీవీ వాళ్లను అలెర్ట్ చేసిన వ్యక్తి.. లైన్లోకి వచ్చి ఈటీవీ వాళ్లకు నచ్చజెప్పారట.

చివరికి ఒక వార్నింగ్‌తో ఈటీవీ వాళ్లు సరిపెట్టి.. లీగల్ నోటీసులు వెనక్కి తీసుకున్నారట. ఈ విషయం మిగతా టాప్ తెలుగు ఛానెళ్లకు కూడా తెలిసిందని.. కేబుల్ ఛానెళ్లకు ఈ వ్యవహారం ఒక హెచ్చరిక అవుతుందని.. ఇంకోసారి ఏ ఛానెల్ అయినా ఇలా చేస్తే అంత తేలిగ్గా వదలొద్దని ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయని సమాచారం. సత్యదేవ్ హీరోగా ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ను బాహుబలి నిర్మాతలు ప్రొడ్యూస్ చేశారు.