శ్రీను వైట్ల.. ఇదైనా ముందుకు కదులుతుందా?

ఒకప్పుడు టాలీవుడ్లో వైభవం చూసిన దర్శకుడు శ్రీను వైట్ల. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్‌లకు దీటుగా ఆయనకు క్రేజ్, మార్కెట్ ఉండేవి. శ్రీనుతో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్లు ఆశపడేవాళ్లు. మహేష్ బాబుతో ‘దూకుడు’ చేసిన టైంలో శ్రీను వైట్ల క్రేజీ మామూలుగా ఉండేది కాదు. కానీ తెలుగు సినిమాల్లో కామెడీ ఎంటర్టైన్మెంట్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లిన ఈ దర్శకుడు.. ఒక దశ తర్వాత మూసలో పడిపోయాడు.

‘ఆగడు’, ‘బ్రూస్ లీ’, ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లాంటి వరుస డిజాస్టర్లలో రేసులో బాగా వెనుకబడిపోయాడు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఏ స్థాయిలో డిజాస్టర్ అయిందంటే.. ఆ సినిమా వచ్చి ఐదేళ్లవుతున్నా ఇంకా శ్రీను వైట్ల కొత్త చిత్రం మొదలు కాలేదు. వేర్వేరు ప్రాజెక్టులు వేర్వేరు కారణాలతో ముందుకు సాగలేదు. మంచు విష్ణు లాంటి ఫాం‌లో లేని హీరోతో ప్లాన్ చేసిన ‘ఢీ’ సీక్వెల్ సైతం అటకెక్కేసింది.

శ్రీను వైట్ల గురించి అందరూ మరిచిపోయిన సమయంలో తన కొత్త చిత్రం గురించి ఈ మధ్య మళ్లీ వార్తలు మొదలయ్యాయి. సీనియర్ హీరో గోపీచంద్‌తో వైట్ల తన కొత్త సినిమా చేయబోతున్నాడట. వీళ్లిద్దరూ ఒక కథ విషయంలో అంగీకారానికి వచ్చారట. నిర్మాత కూడా సెట్ అయ్యాడంటున్నారు. త్వరలోనే ప్రారంభోత్సవం కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తనకు బాగా అచ్చి వచ్చినా కామెడీ జానర్లోనే వైట్ల ఈ సినిమా చేయబోతున్నాడట.

గోపీచంద్ ఎక్కువగా యాక్షన్ మూవీసే చేసినా. ‘లౌక్యం’ లాంటి ఎంటర్టైనర్లు అతడికి మంచి ఫలితాలే ఇచ్చాయి. వీరి కలయికలో ఇలాంటి సినిమానే రావచ్చని అంటున్నారు. వైట్ల లాగే గోపీచంద్ మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. చివరగా అతడి నుంచి వచ్చిన ‘రామబాణం’ పెద్ద డిజాస్టర్ అయింది. ఇలాంటి కాంబినేషన్లో సినిమాను ముందుకు తీసుకెళ్లడం అంత తేలిక కాదు. మరి వైట్లకు ఈసారైనా కాలం కలిసొచ్చి.. ముందు అనుకున్న చిత్రాలకు భిన్నంగా ఇది సెట్స్ మీదికి వెళ్తుందేమో చూడాలి.