ఇది క్లిక్ అయితే కెరీర్‌ నెక్స్ట్ లెవెలే

గత ఏడాది ‘కార్తికేయ-2’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ కావడంతో యువ కథానాయకుడు నిఖిల్ రేంజే మారిపోయింది. అతడితో కొంచెం పెద్ద బడ్జెట్లలో సినిమాలు తీయడానికి నిర్మాతలు రెడీ అయిపోయారు. ‘స్పై’ ఆ కోవలోని సినిమానే. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అయినా సరే.. నిఖిల్‌కు డిమాండ్ ఏమీ తగ్గిపోలేదు. ఆల్రెడీ పాన్ ఇండియా స్థాయిలో ‘ది ఇండియా హౌస్’ అనే పెద్ద సినిమా చేస్తున్నాడతను.

ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. తాజాగా ‘స్వయంభు’ సెట్స్ మీదికి వెళ్లింది. ఈ చిత్రం శుక్రవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. దీంతో పాటే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేస్తున్నారు. సినిమా మొదలైన సందర్భంగా ఒక ఎగ్జైటింగ్ పోస్టర్‌తో చిత్ర బృందం ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచింది. అందులో గుర్రం మీద యోధుడి అవతారంలో కనిపిస్తున్నారు. పోస్టర్ డిజైన్ చూస్తే మాత్రం ‘మగధీర’ లాంటి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.

టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు.. శ్రీకర్, భువన్‌లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బడ్జెట్ దాదాపు రూ.30 కోట్లని సమాచారం. భ‌ర‌త్ కృష్ణ‌మాచారి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. అత‌ను త‌మిళంలో కొన్ని సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేశాడు. చోళుల కాలం నాటి ఒక యోధుడి కథను అతను నిఖిల్ కోసం రెడీ చేశాడు.

ఐతే చోళులు అంటే ‘పొన్నియన్ సెల్వన్’యే అందరికీ గుర్తుకు వస్తుంది కాబట్టి ఆ ప్రస్తావన లేకుండా ఒక కల్పిత కథగా తెరపై దీన్ని ప్రెజెంట్ చేయబోతున్నారట. స్క్రిప్టు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో తెర‌కెక్క‌నుంది. మ‌నోజ్ ప‌ర‌మ‌హంస‌, ర‌వి బ‌స్రూర్ (కేజీఎఫ్ ఫేమ్‌) లాంటి టాప్ టెక్నీషియ‌న్లు ఈ సినిమాకు ప‌ని చేయ‌నున్నారు. బింబిసార ర‌చ‌యిత వాసుదేవ్ మునెప్ప‌గారి ఈ చిత్రానికి మాట‌లు రాస్తున్నాడు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. ‘స్వయంభు’తో నిఖిల్ రేంజే మారిపోయేలా ఉంది.