వివాదాస్పద చావుల మీద తమన్నా సినిమా

కంటెంట్ కోసం రచయితలు, దర్శకులు కొత్తగా ఆలోచించాల్సిన పని లేదు. నిజ జీవిత సంఘటనల నుంచి బోలెడు కథలు దొరుకుతాయని కొందరు ఫిలిం మేకర్స్ నిరూపిస్తున్నారు. 2018 దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో చందావత్ కుటుంబానికి చెందిన 11 మంది  ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఇవి హత్యలా లేక నిజంగానే ఆత్మ త్యాగం చేశారా అని తేల్చడానికి పోలీసులకు చుక్కలు కనిపించాయి. ఎంతో ఉన్నత సామజిక వర్గానికి చెందిన ధనవంతులైన ఫ్యామిలీ ఇలా చేతులారా బలి కావడం అందరినీ షాక్ కి గురి చేసింది.

ఇప్పుడీ ఉదంతం మీదే తమన్నా నటించిన ఆఖ్రి సచ్ ఆగస్ట్ 25న హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. గతంలో నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ని ఈ కాన్సెప్ట్ మీద రూపొందించింది. దానికి అద్భుత స్పందన వచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీ సినిమా స్టైల్ లో ఉండదు. నిజమైన లొకేషన్లతో పాటు ఆ ఘటనలు సంబంధించిన వ్యక్తులు, పోలీస్ ఆఫీసర్ల ఇంటర్వ్యూలతో నడుస్తుంది . కానీ ఆఖ్రి సచ్ కి అవసరమైన డ్రామాని జోడించి నాటకీయతను పెంచారు. కాకపోతే ఒరిజినల్ స్టోరీని మార్చకుండా విచారణ ఎలా జరిగిందనే పాయింట్ ని డిఫరెంట్ గా చూపించబోతున్నారు.

డిజిటల్ ఓటిటిలో బాగా బిజీ అవుతున్న తమన్నాకు ఇటీవలే లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దే బాగానే పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడీ ఆఖ్రి సచ్ వాటి తరహాలో అడల్ట్ కంటెంట్ ఉన్నది కాకపోవడంతో అన్ని వర్గాలకు మరింత దగ్గరవుతాననే నమ్మకంతో ఉంది. ఒళ్ళు జలదరింపజేసే వాస్తవాలతో బురారీ మరణాల వెనుక ఎన్నో విషాదాలున్నాయి. నమ్మశక్యం కాని విధంగా మనుషుల మానసిక స్థితి ఎంతటి కిరాతకాలకు ఒడి కడుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ టైంలో డిపార్ట్ మెంట్ నిజాలైతే వెలికి తీసింది కానీ ఇంకా ఎన్నో శేషప్రశ్నలు ఛందావత్ బంధువులను వెంటాడుతూనే ఉన్నాయి.