తెలుగు హీరోయిన్ ఆవేదన

తెలుగు హీరోయిన్లకు తెలుగులో ప్రాధాన్యం తక్కువ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల నుంచి ఈ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా 2000 తర్వాత పర భాషా కథానాయికలదే ఇక్కడ ఆధిపత్యం. దక్షిణాదిన కూడా మలయాళం, తమిళం, కన్నడ నుంచి ఇక్కడికి హీరోయిన్లను తెచ్చుకుని పెద్ద సినిమాల్లో ఛాన్సులు ఇస్తారు కానీ.. తెలుగు అమ్మాయిలకు మాత్రం ప్రయారిటీ ఉండదు.

ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. అంజలి, స్వాతి, ఆనంది, శ్రీ దివ్య లాంటి హీరోయిన్లు తమిళంలో వెళ్లి మంచి పేరు సంపాదించారు. బోలెడన్ని అవకాశాలు అందుకున్నారు కానీ.. వాళ్లెవ్వరికీ తెలుగులో అంత మంచి ఛాన్సులు రాలేదు. ఇప్పుడు మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆమె తెలుగులో కథానాయికగా చాలా వరకు చిన్న సినిమాలే చేసింది. ఆమెకు ఇప్పుడు తమిళం, మలయాళంలో అవకాశాలు వస్తున్నాయి.

తెలుగులో తెలుగు అమ్మాయిలకు ప్రయారిటీ లేకపోవడంపై ఈషా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. వేరే భాషలకు వెళ్తే తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడతారని.. కానీ మన దగ్గర మన హీరోయిన్లకు తగిన గుర్తింపు ఉండదని ఆమె వ్యాఖ్యానించింది. ‘‘ప్రస్తుతం నేను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తున్నా. వేరే ఇండస్ట్రీల వాళ్లు తెలుగు సినిమా స్టామినా గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ షూటింగ్‌ కోసం వెళ్లినప్పుడు వాళ్లందరూ టాలీవుడ్‌ గురించే మాట్లాడుకోవడం చూసి గర్వంగా అనిపించేది.

కానీ మన దగ్గర తెలుగు భాష వచ్చిన వాళ్ల కంటే తెలుగు తెలియని వాళ్లకే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. ఇతర రాష్ర్టాల వాళ్లని హీరోయిన్లుగా పెటుకోమని ప్రేక్షకులేమీ అడగరు. అలాంటప్పుడు వాళ్లకే ఎక్కువ అవకాశాలు ఎందుకివ్వాలి? హీరోయిన్లు అనే కాదు.. అన్ని పాత్రల గురించీ నేనీ ప్రశ్న అడుగుతున్నా. తెలుగు వారిలో ఎంతోమంది ప్రతిభావంతులున్నారు. వారికి ఎలాంటి అవకాశాలు దక్కడం లేదు. తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇచ్చినా హీరోయిన్లుగా కాదు’’ అని ఈషా రెబ్బా పేర్కొంది.