బాక్సాఫీస్‌పై ‘మెగా’ ఎటాక్

మెగా అభిమానులకు 2023 ఆరంభంలోనే మంచి కిక్కు దొరికింది. సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ అయి కొత్త సంవత్సరంలో మెగా ఫ్యామిలీకి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక వేసవిలో వచ్చిన సాయిధరమ్ తేజ్ సినిమా ‘విరూపాక్ష’ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో అభిమానుల ఆనందం రెట్టింపయింది.

ఇప్పుడు మెగా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేయడానికి బాక్సాఫీస్ రెడీ అవుతోంది. నెల రోజుల వ్యవధిలో మెగా హీరోల సినిమాలు నాలుగు రిలీజ్ కాబోతుండటం విశేషం. ఇంతకు ముందెన్నడూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఇంత తక్కువ వ్యవధిలో ఇలాంటి ‘మెగా’ రష్ చూసి ఉండరు అభిమానులు. ఈ నెల 28న పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్‌ల ‘బ్రో’ మూవీతో సందడి మొదలు కాబోతోంది. 

మామా అల్లుళ్లయిన పవన్, తేజు కలిసి సినిమా చేయడమే మెగా అభిమానులకు పెద్ద విశేషం. ఇది రీమేక్ మూవీ అయినప్పటికీ.. కావల్సినంత బజ్ వచ్చింది. ప్రోమోలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్, తేజులకు మరో హిట్ కచ్చితంగా రాబోతోందని ట్రేడ్ వర్గాలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇక రెండు వారాలకే మెగాస్టార్ చిరంజీవి వేంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటించిన ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ ఆగస్టు 11న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు హైప్ కొంచెం తక్కువే కానీ.. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరు నుంచి వస్తున్న సినిమా, పైగా ఇండిపెండెన్స్ వీకెండ్లో రిలీజ్ కాబట్టి ఓ మోస్తరుగా సందడి చేసినా.. సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంటుందనే ధీమాతో అభిమానులు ఉన్నారు. ఇక చిరు సినిమా వచ్చిన వారం రోజులకే ఆయన చిన్న మేనల్లుడు, తేజు తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ సినిమా ‘ఆదికేశవ’ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఆగస్టు 18 రిలీజ్ డేట్‌గా ఖరారైంది. ఇక నెలాఖర్లో వరుణ్ తేజ్ సినిమా ‘గాండీవధారి అర్జున’ రాబోతోంది. ఇలా నాలుగు వారాల వ్యవధిలో మెగా హీరోల సినిమాలు నాలుగు రిలీజ్ కావడం అరుదైన విషయమే.