రాక్షస రాజు అంత రిస్కు చేస్తాడా

దర్శకుడు తేజ్ ఎంత బ్యాడ్ ఫామ్ లో ఉన్నారో ఇటీవలే వచ్చిన అహింస మరోసారి ఋజువు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు నువ్వు నేను, చిత్రం, జయం లాంటి బ్లాక్ బస్టర్స్ ని కొత్త హీరోలకు ఇచ్చిన ఈ వెటరన్ డైరెక్టర్ తన మేజిక్ టచ్ ని కోల్పోవడం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో తీసిన సీత గురించి మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. అయినా సరే సురేష్ సంస్థకు ఆయనంటే తగని నమ్మకం. కారణం నేనే రాజు నేనే మంత్రి సక్సెస్. అదేమీ భీభత్సమైన రికార్డులు సృష్టించకపోయినా రానా వరకు సోలో హీరోగా మంచి హిట్టునే ఇచ్చింది.

ఇప్పుడు ఈ కాంబోలో రాక్షస రాజు రాబోతోంది. తేజ స్వయంగా ఈ విషయాన్ని చెప్పడం చూశాం. అయితే ఇదో పొలిటికల్ థ్రిల్లర్. గాడ్ ఫాదర్ తరహా షేడ్స్ ఉంటూనే బోలెడు ట్విస్టులతో పాటు వర్తమాన రాజకీయాల గురించి చాలా వివాదాస్పద అంశాలు ఉంటాయని తెలిసింది. అయితే దీన్ని రెండు భాగాలుగా తీసే ప్లాన్ లో తేజ ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. కథ మీద ఎంత నమ్మకం ఉన్నా సరే ఇది ఒక రకంగా రిస్కే. ఒకవేళ మొదటి భాగం ఏదైనా తేడా కొడితే సెకండ్ పార్ట్ ని బయ్యర్లకు నష్టాలు పూడ్చుకోవడానికి అమ్మాలి తప్పించి ఇంకెలాంటి ప్రయోజనం కలగదు.

కెజిఎఫ్, బాహుబలి రేంజ్ లో సక్సెస్ అయితేనే రాక్షస రాజుకి సీక్వెల్ ఐడియా వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉందట. నిర్ణయం తీసుకునే ముందు సురేష్ బాబుతో చర్చించి స్క్రిప్ట్ ని లాక్ చేస్తారు. కంబ్యాక్ కోసం కష్టపడుతున్న తేజకు మళ్ళీ రాక్షస రాజులాంటి పెద్ద ఛాన్స్ రాకపోవచ్చు. దీంతోనే ఋజువు చేసుకోవాలి. రానా కూడా బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆగస్ట్ లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోపీచంద్ తో ప్లాన్ చేసుకున్న మరో ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది. రాక్షస రాజు ప్రోగ్రెస్ ని బట్టి అది ఉన్నది లేనిది తేలబోతోంది.