దుల్కర్ సల్మాన్‌కు ఏమైంది?

భాష, ప్రాంతీయ భాష భేదాలు ఏమీ లేకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుల్లో దుల్కర్ సల్మాన్ ఒకడు. మమ్ముట్టి వారసుడు కాబట్టి అతను మలయాళంలో స్టార్ కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను.. ‘ఓకే బంగారం’, ‘కన్నుం కన్నుం కొల్లయడిత్తాల్’ సినిమాలతో తమిళ ఆడియన్స్‌ను.. ‘కార్వాన్’; ‘చుప్’ మూవీస్‌తో బాలీవుడ్ వాళ్లను కట్టి పడేశాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.

త్వరలోనే ‘కింగ్ ఆఫ్ కొత్తా’ అనే భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న దుల్కర్.. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టి డెలీట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అభిమానులను కంగారు పెట్టింది. దుల్కర్ ఆ పోస్టులో కాస్త కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోను షేర్ చేయడం ఈ ఆశ్చర్యానికి, ఆందోళనకు ప్రధాన కారణం.

‘‘నేను నిద్రపోయి చాలా సమయం అవుతోంది. ఇలాంటిది నా అనుభవంలోకి రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందెన్నడూ ఇది జరగలేదు. నా మనసు నుంచి ఇది పోని స్థితికి నేను చేరుకున్నాను. నేను ఇంకా ఎంతో చెప్పాలనుకుంటున్నా. కానీ చెప్పలేను’’ అని దుల్కర్ ఆ పోస్టులో పెట్టాడు. అభిమానులు ఆ ఫొటో, ఈ మెసేజ్ చూసి కంగారు పడి ఏమైంది దుల్కర్ అని అడుగుతుంటే.. కొన్ని నిమిషాలకే అతను ఈ పోస్టు డెలీట్ చేశాడట.

దీంతో ‘What happened to dulquer’ అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. కానీ దుల్కర్ తర్వాత సైలెంటుగానే ఉన్నాడు తప్ప సమాధానం ఇవ్వలేదు. మరి దుల్కర్‌ను ఇంతగా డిస్టర్బ్ చేసిన విషయం ఏంటనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న దుల్కర్ కొత్త సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్తా’ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.