ఆమిర్ ఖాన్ ద‌ర్శ‌నం ఇక అప్పుడే

సినిమా తీసేది ద‌ర్శ‌కుడు. కాబ‌ట్టి ఫ‌లానా ద‌ర్శ‌కుడి సినిమాలో క్వాలిటీ ఉంటుంది.. ఆ ద‌ర్శ‌కుడి చిత్ర‌మైతే భిన్నంగా ఉంటుంది అని న‌మ్మి జ‌నాలు సినిమాల‌కు వెళ్తుంటారు. కానీ ఒక హీరో సినిమాలో బ‌ల‌మైన కంటెంట్ ఉంటుంది, ఏదో ఒక కొత్త‌ద‌నం ఉంటుంద‌ని కోట్ల మంది న‌మ్మి సినిమాల‌కు వెళ్లే న‌మ్మ‌కం క‌లిగించి హీరో ఆమిర్ ఖాన్. ల‌గాన్, రంగ్ దె బ‌సంతి, త్రీ ఇడియ‌ట్స్, పీకే, దంగ‌ల్.. ఈ సినిమాల వ‌రుస చూస్తే చెప్పేయొచ్చు ఆమిర్ సినిమాల క్వాలిటీ ఏంటో. ఎప్పుడో కానీ అత‌డి సినిమాలు తేడా కొట్ట‌వు. థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఆ కోవ‌లోని చిత్ర‌మే. ఇది విడుద‌లై రెండేళ్లు కావ‌స్తోంది. ఈ సినిమా రిలీజ‌య్యాక ఏడాది విరామం తీసుకుని హ‌లీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్‌ను ప‌ట్టాలెక్కించాడు ఆమిర్.

లాల్ సింగ్ చ‌ద్దా పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా వ‌చ్చి ఆమిర్ ప్ర‌ణాళిక‌ల్ని దెబ్బ తీసింది. ఐదు నెల‌లుగా షూటింగ్ జ‌ర‌గ‌ట్లేదు. వ‌చ్చే కొన్ని నెల‌ల్లోనూ చిత్రీక‌ర‌ణ సాధ్య‌ప‌డేలా లేదు. దీంతో ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది వేస‌వికో.. లేదంటే ఇండిపెండెన్స్ డే సీజ‌న్‌కో వాయిదా వేస్తార‌ని అనుకున్నారు. కానీ ఆమిర్ మాత్రం త‌న‌కెంతో ఇష్ట‌మైన క్రిస్మ‌స్ సీజ‌న్‌లోనే సినిమాను తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. క్వాలిటీ విష‌యంలో అస‌లు రాజీ ప‌డ‌ని ఆమిర్.. ఆ ఉద్దేశంతోనే కాస్త ఎక్కువ స‌మ‌యం తీసుకునేలా ఉన్నాడు. ఆమిర్ మిత్రుడైన అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో క‌రీనా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.