పరిశ్రమకు పరశురామ్ పాఠం

Parasuram To Direct Balakrishna?
Parasuram To Direct Balakrishna?


ఫిలిం ఇండస్ట్రీలో మాట మీదే చాలా పనులు నడిచిపోతుంటాయి. ఎప్పుడో తన కెరీర్ ఆరంభంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ రాజమౌళి.. తన కెరీర్ పతాక స్థాయిలో ఉండగా ఇప్పుడు డీవీవీ దానయ్యకు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి పెట్టాడు. మహేష్ బాబుతో ఆయన చేయబోతున్న కొత్త చిత్రం కూడా ఇలా ఎన్నో ఏళ్ల కిందట ఇచ్చిన మాట ప్రకారం కె.ఎల్.నారాయణకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అంటే అలా ఉంటుంది. అందుకే మాట ఇచ్చేటపుడు, అడ్వాన్సులు పుచ్చుకునేటపుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలని అంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుంటే ఇండస్ట్రీలో పేరు చెడుతుంది. తప్పిన హామీలు ఎక్కువ ఉంటే.. అంతే సంగతులు. ఇప్పుడు దర్శకుడు పరశురామ్ ఇలాగే ఇండస్ట్రీలో బాగా బద్నాం అయిపోతున్నాడు.

‘గీత గోవిందం’ పెద్ద హిట్టవడంతో అప్పట్లో అతడితో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు ముందుకొచ్చారు. అతను ఎవరికి ఎప్పుడు సినిమా చేస్తాననే క్లారిటీ లేకుండా అందరి దగ్గరా అడ్వాన్సులు తీసేసుకున్నాడు. కొందరికి నోటి మాటగా హామీలు ఇచ్చాడు. ఐతే ఇప్పటిదాకా ఒక్కరి దగ్గరా మాట నిలుపుకుని సినిమా చేసిన దాఖలాలు లేవు. ‘గీత గోవిందం’ తర్వాత ఐదేళ్ల వ్యవధిలో అతను చేసింది ఒక్క ‘సర్కారు వారి పాట’ మాత్రమే. ఆ సినిమా కూడా 14 రీల్స్ బేనర్లో నాగచైతన్య సినిమాను క్యాన్సిల్ చేసి చేశాడు. 14 రీల్స్ వాళ్లను ‘సర్కారు వారి పాట’లో ఇరికించినా.. వాళ్లకు ఫుల్ లెంగ్త్ సినిమా చెయ్యాల్సిన కమిట్మెంట్ అలాగే ఉండిపోయింది. వాళ్లు పరశురామ్ విషయంలో డిజప్పాయింట్మెంట్‌తో ఉన్నారు.

నాగచైతన్య తన సినిమాను క్యాన్సిల్ చేసి మహేష్ బాబుతో చిత్రం చేయడంతో తన టైం వేస్ట్ అయిందని ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడేమో అల్లు అరవింద్.. పరశురామ్ మీద పరోక్ష విమర్శలు చేశాడు. అరవింద్ స్థాయి వ్యక్తి ఇలా ఒక దర్శకుడి విషయంలో ఇంత హర్ట్ కావడం ఎప్పుడూ చూసింది లేదు. పరశురామ్‌కు అడ్వాన్సులు ఇచ్చిన ఇంకో ఇద్దరు సీనియర్ నిర్మాతలు సైతం అతడి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందరి దగ్గర పేరు చెడగొట్టుకుని పరశురామ్ ఎలా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. మొత్తంగా చూస్తే పరశురామ్ వ్యవహారం ఇండస్ట్రీకి ఒక పాఠం లాగా నిలుస్తోంది.