హిడింబ హింసలో పీరియాడిక్ టచ్

స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా అశ్విన్ బాబు హీరోగా అడపాదడపా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ వాటికి సరైన ఫలితాలే అందుకోలేకపోతున్నాడు. అన్నయ్య ఎంతో చేయూత ఇచ్చి జీనియస్ నుంచి రాజుగారి గది 3 వరకు అవకాశాలు ఇస్తూ వచ్చాడు కానీ కుర్రాడికి మాత్రం సోలో హిట్టు పడటం లేదు. ఇన్నేళ్లకు ఓ డిఫరెంట్ జానర్ తో వచ్చే ప్రయత్నం చేశాడు. అదే హిడింబ. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణతో అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్ తాలూకు ట్రైలర్ ని నిన్న సాయిధరమ్ తేజ్ అతిధిగా హైదరాబాద్ లో గ్రాండ్ లాంచ్ చేశారు.

కాన్సెప్ట్ ఏదో డిఫరెంట్ గానే ఉంది. నగరంలో వరసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడికి ఎరుపు రంగుతో ఏదో కనెక్షన్ ఉంటుంది. కేవలం ఆ కలర్ ని ధరించిన వాళ్లను మాత్రమే అతి కిరాతకంగా మర్డర్ చేస్తూ ఉంటాడు . కేసుని ఛేదించడానికి బరిలో దిగిన  ఇన్స్ పెక్టర్(అశ్విన్ బాబు), అతని లేడీ కొలీగ్(నందితా శ్వేతా)కు ఎలాంటి క్లూస్ దొరక్క తీవ్రంగా శోధిస్తుంటారు. దీనికి 1908లో బే అఫ్ బెంగాల్ ఒడ్డున బ్రిటిషర్లు చేసిన భారతీయుల ఊచకోతకు సంబంధించిన కీలక ఆధారాలు దొరుకుతాయి. అవేంటనేది తెరమీద చూస్తే కానీ సస్పెన్స్ వీడదు

విజువల్స్ చాలా వయొలెంట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇలాంటి సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ కొత్త కాకపోయినా హిడింబ నేపధ్యం, వందేళ్ల క్రితం జరిగిన సంఘటన తాలూకు రిఫరెన్స్ ఇవన్నీ ఆసక్తి రేపుతున్నాయి. వికాస్ బడిసా సంగీతం, రాజశేఖర్ ఛాయాగ్రహణం మంచి క్వాలిటీని ఇచ్చాయి. హైప్ ని తేవడంలో దర్శకుడు అనీల్ కన్నెగంటి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సస్పెన్స్ ఫ్యాక్టర్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. హింసతో కూడిన ఇంటెన్సిటీ గట్టిగానే ఉంది. ఇంకా విడుదల తేదీ ఖారారు కాని హిడింబతో అయినా అశ్విన్ సోలో హీరోగా హిట్టు కొడతాడేమో చూడాలి.