లియోలో తండ్రీ కొడుకుల ట్విస్టు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మార్కెట్ ప్రతి సినిమాకు పెరగడమే తప్ప ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు. అందరూ టీవీ సీరియల్ లా ఉందని విమర్శించిన వారసుడుతో సైతం మూడు వందల కోట్లను రాబట్టడం విజయ్ కే చెల్లింది. పివిఆర్ మల్టీప్లెక్స్ ఇటీవలే వెల్లడించిన ఆర్థిక ఫలితాల్లో దీనిదే అగ్ర స్థానం కావడం గమనార్హం. ఇప్పుడు ఇతని రెమ్యునరేషనే 200 కోట్లని తన 68వ ప్రాజెక్ట్ కి అంత మొత్తం ఇవ్వడానికి నిర్మాత సరే అన్నారనే వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం విజయ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో లియో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఇంటరెస్టింగ్ లీక్ ఒకటి బయటికి వచ్చింది. లియోలో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి యూనిట్ ఎప్పుడో రివీల్ చేసింది. ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో సంజు భాయ్ విజయ్ ఇద్దరూ తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా.

మాఫియా సామ్రాజ్యానికి దూరంగా కాశ్మీర్ లో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టుకుని ప్రశాంతంగా జీవిస్తున్న లియో జాడను కనుక్కున్న శత్రువులు అక్కడిదాకా వస్తారు. దేశం మొత్తం వణికిపోయే నాన్నను వదిలేసి లియో అక్కడికి ఎందుకు వచ్చాడనేదే అసలు పాయింటట. ఇలాంటి స్టోరీ లైన్ తో గతంలో చాలానే వచ్చాయి. ఒకకరంగా వీటికి హాలీవుడ్ క్లాసిక్ గాడ్ ఫాదరే స్ఫూర్తి.

అయితే లోకేష్ మార్క్ ట్రీట్ మెంట్ చాలా కొత్తగా ఉంటుందని విక్రమ్ లో ఎలా అయితే కమల్ హాసన్ ని ప్రెజెంట్ చేశారో అంతకు మించి అనే స్థాయిలో ఎలివేషన్లు ఇస్తారట. అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల కాబోతున్న లియోకు అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులో బాలయ్య, రవితేజలతో గట్టి పోటీ ఎదురుకోవాల్సి ఉంటుంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ చేస్తున్న లియో బిజినెస్ ని మూడు వందల కోట్లకు టార్గెట్ చేసుకున్నారని టాక్.