‘కామెడీ’ కష్టాలపై నరేష్ కుండబద్దలు కొట్టేశాడు

Allari naresh
Allari naresh

ఒకప్పుడు తెలుగులో కామెడీ సినిమాలు వెల్లువలా వచ్చేవి. కామెడీ సినిమాలు తీయడానికే చాలామంది దర్శకులు ఉండేవాళ్లు. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు లాంటి దర్శకులు తిరుగులేని కామెడీ సినిమాలతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేవాళ్లు. వీళ్ల వల్ల చాలామంది కామెడీ రైటర్లకు పని ఉండేది.

అలాగే మరే ఇండస్ట్రీలో లేని విధంగా రెండంకెల సంఖ్యలో కమెడియన్లు ఎప్పుడూ బిజీగా ఉంటుండేవాళ్లు. కానీ ఈ వైభవమంతా గత పది పదిహేనేళ్లలో కరిగిపోయింది. కామెడీ తీసే లెజెండరీ డైరెక్టర్లో ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. నటీనటులు కూడా చాలామంది కాలం చేశారు. రచయితలు కనుమరుగయ్యారు. ఇప్పుడు తెలుగు సినిమాలు కామెడీ లేక వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు కామెడీనే నమ్ముకుని సినిమాలు చేసిన అల్లరి నరేష్.. ఇప్పుడు సీరియస్ సినిమాలు చేసుకుంటున్నాడు.

మీరెందుకు కామెడీ సినిమాలు చేయట్లేదు అని తన కొత్త చిత్రం ‘ఉగ్రం’ ప్రమోషన్ల సందర్భంగా మీడియా వాళ్లు అడిగితే.. అతను మారిన పరిస్థితులపై కుండబద్దలు కొట్టేలా మాట్లాడాడు. ‘‘ఇప్పుడు కామెడీ రాసేవాళ్లు ఎవరున్నారు? తీసేవాళ్లు ఎవరున్నారు? కామెడీ రాయడం చాలా కష్టం. ఎలాంటి ఇన్‌స్పిరేషన్ లేకుండా కొత్తగా కామెడీ రాయడం ఒక సవాల్.

అప్పట్లో మా నాన్న గారి దగ్గరే పదుల సంఖ్యలో రైటర్లు ఉండేవాళ్లు. అందరూ కలిసి ఒకే ప్రాజెక్టు చేసేవాళ్లు. అందరిలో మా పేరు వస్తే చాలు అనుకునే వారు. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్లు పేరు తెచ్చకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పైగా ఇప్పుడు చాలా లిమిటేషన్ల మధ్య పని చేయాల్సి వస్తోంది. ‘కితకితలు’ లాంటి సినిమాను ఇప్పుడు తీస్తే బాడీ షేమింగ్ అని గొడవ చేస్తారు. స్వచ్ఛమైన కామెడీతో కథలు రాయడం ఇప్పుడు సాధ్యం కావడం లేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది’’ అని నరేష్ అన్నాడు.