అమృత నోటీసులిచ్చింది.. కానీ వర్మకి కాదు

Murder

నిజ జీవిత వ్యక్తులు, సంఘటనల మీద సినిమాలు తీయడం రామ్ గోపాల్ వర్మకు కొత్త కాదు. ఈ క్రమంలోనే ఆయన సినిమాల చుట్టూ వివాదాలు ముసురుకుంటూ ఉంటాయి. అవతలి వాళ్లు హెచ్చరిస్తారు. వారిస్తారు. అభ్యర్థిస్తారు. కానీ దేనికీ వర్మ తలొగ్గడు సినిమా చుట్టూ ముసురుకునే వివాదాల్ని పబ్లిసిటీకి వాడుకుని ప్రయోజనం పొందాలని చూస్తుంటాడు.

ఇంకా చెప్పాలంటే వివాదాస్పదం అయ్యే.. మంచి పబ్లిసిటీ వచ్చే కథల్నే వర్మ ఎంచుకుంటాడు. ఈ మధ్య ఈ విషయంలో వర్మ ఈ మధ్య మరీ శ్రుతిమించి పోతున్న సంగతి తెలిసిందే.

మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత ప్రేమ వ్యవహారం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో వర్మ ‘మర్డర్’ పేరుతో ఓ సినిమా తీసిన సంగతి తెలిసిందే. అమృత వ్యవహారంలో తప్పెవరిది, ఒప్పెవరిది అన్నది పక్కన పెడితే ఇప్పటికే భర్తను కోల్పోయి.. ఈ మధ్యే తండ్రినీ దూరం చేసుకుని తీవ్ర మానసిక వేదనను ఎదుర్కొంటోందామె.

ఆ ఇద్దరి మరణాలకూ కారణం తనే అంటూ సొసైటీ నుంచి ఆమె తీవ్ర వ్యతిరేకతనూ ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఆమె మీద సినిమా తీయడం ఎంత వరకు సబబన్నది వర్మ ఆలోచించాలని ఈ చిత్రాన్ని ప్రకటించినపుడు అందరూ అన్నారు. కానీ వర్మ పట్టించుకోలేదు. దీంతో అమృత ఇప్పుడు న్యాయ పోరాటానికి సిద్ధమైంది.

‘మర్డర్’ సినిమా నిర్మాతలకు అమృత కోర్టు ద్వారా నోటీసులు పంపింది. అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. ఐతే చిత్ర నిర్మాతలుగా పేరు పడ్డ నట్టి క్రాంతి, నట్టి కరుణలకు మాత్రమే అమృత నోటీసులు పంపింది.

ఈ చిత్రానికి సమర్పకుడు, నిర్మాణ భాగస్వామి, సినిమా మొత్తాన్ని ముందుండి నడిపిస్తున్న రామ్ గోపాల్ వర్మకు మాత్రం అమృత నోటీసులు పంపకపోవడం గమనార్హం. మర్డర్ సినిమా విడుదలను ఆపాలని, పబ్లిసిటీని కూడా వెంటనే నిలిపివేయాలని కోర్టును అమృత కోరింది. ఈ నెల 6న నిర్మాతలు కోర్టుకు హాజరై, వారి వాదనను తెలపాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది.