ఆ డైరెక్టర్ని ఏకిపడేస్తున్న నెటిజన్లు

‘స్వామి రారా’ సినిమాతో టాలీవుడ్లో అందరూ తన వైపు చూసేలా చేశాడు యువ దర్శకుడు సుధీర్ వర్మ. చంద్రశేఖర్ యేలేటి ‘అనుకోకుండా ఒక రోజు’ తర్వాత టాలీవుడ్లో థ్రిల్లర్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ లాగా నిలిచింది ‘స్వామి రారా’. క్వింటన్ టొరంటినో, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుల ప్రభావం తన మీద ఉన్న విషయం చెబుతూ వాళ్ల సినిమాల నుంచి స్ఫూర్తి పొందడమే కాక.. కాపీ కొట్టడానికి కూడా వెనుకాడనని ఆ సినిమా టైటిల్స్‌లో అతను పేర్కొనడం కూడా ఒక సంచలనమే.

తొలి సినిమా తర్వాత అతడి మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ సినిమా వచ్చి పదేళ్లు గడిచిపోగా.. ఇప్పటిదాకా మళ్లీ దానికి దరిదాపుల్లో నిలిచే సినిమా ఏదీ తీయలేకపోయాడు సుధీర్. కేశవ, రణరంగం లాంటి సినిమాలు చూసినపుడు.. టేకింగ్ పరంగా సూపర్, సరైన కథను ఎంచుకోకపోవడమే సుధీర్ సమస్య అనుకున్నారు. కానీ ఇటీవలే రిలీజైన ‘రావణాసుర’ చూశాక సుధీర్ టేకింగ్ సహా అన్ని విషయాల్లో పట్టు కోల్పోయాడని స్పష్టం అవుతోంది.

‘రావణాసుర’ చిత్రాన్ని థియేటర్లలో చూసిన వాళ్లు అప్పట్లోనే సుధీర్ వర్మ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్దగా జనాల దృష్టిలో పడకుండానే ఆ సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కాగా.. మరోసారి ఇదెంత పేలవమైన సినిమా అనే విషయంలో చర్చ జరుగుతోంది. నెటిజన్లు అందరూ సుధీర్ వర్మ మీద విరుచుకుపడుతున్నారు. ‘స్వామి రారా’తో ఇంటలిజెంట్ డైరెక్టర్ అని, హాలీవుడ్ ప్రమాణాలతో థ్రిల్లర్లు తీయగల సమర్థుడని కితాబులు అందుకున్న దర్శకుడు.. మినిమం లాజిక్ లేకుండా ‘మాస్క్’ కాన్సెప్ట్‌ను డీల్ చేసిన విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత సిల్లీగా సినిమా ఎలా తీశావ్ అంటూ సుధీర్‌ను నిలదీస్తున్నారు.

ఒకప్పుడు అతణ్ని అభిమానించిన వాళ్లే ఇప్పుడు తనపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి కథను సొంత బేనర్లో ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధ పడ్డ రవితేజను కూడా తప్పుబడుతున్నప్పటికీ.. ప్రధానంగా అందరూ టార్గెట్ చేస్తున్నది సుధీర్‌నే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసే దర్శకులు ఇలాంటి తప్పులు చేస్తే పట్టించుకోరు కానీ.. ‘స్వామి రారా’ లాంటి డిఫరెంట్ థ్రిల్లర్ తీసిన డైరెక్టర్ ఇంత ఇల్లాజికల్‌గా సినిమా తీసేసరికి కోపం తన్నుకొస్తున్నట్లుంది.