ఓటిటి దిగ్గజాలకు జియో అదిరిపోయే దెబ్బ

ఫోర్ జి టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ రంగంలో విప్లవత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖేష్ అంబానీ తాజాగా తన జియో సినిమా ఓటిటి విస్తరించే పనిని ఊహించని రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఐపిఎల్ సీజన్ ని ఉచితంగా స్ట్రీమింగ్ చేసి రోజూ కోట్లాది సబ్స్క్రైబర్లు తన వద్దకు వచ్చేలా చేసుకున్న ఈ బిజినెస్ దిగ్గజం త్వరలోనే దీనికి ఏడాది, నెలల వారిగా చందాల పద్ధతిని తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. గరిష్టంగా సంవత్సరానికి ఆరు వందల రూపాయలు కడితే నాలుగు డివైజెస్ లో నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ తో త్వరలోనే ప్లాన్ లాంచ్ చేయవచ్చట.

ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారేమో. అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. ఇటీవలే డిస్నీ హాట్ స్టార్ నుంచి సుప్రసిద్ధ హెచ్బిఓ తన కంటెంట్ ని విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో క్లాసిక్ బ్లాక్ బస్టర్స్, వెబ్ సిరీస్ లు వీళ్ళ గొడుగులో ఉన్నాయి. ఈ పరిణామం హాట్ స్టార్ కు భారీ మూల్యం చెల్లించేలా చేస్తుందని విశ్లేషకులు హెచ్చరించారు. ఇప్పుడిది జియో సొంతం. వార్నర్ బ్రోస్ తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆ సంస్థకు సంబంధించిన సరుకంతా జియో సినిమాలో వచ్చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ లాంటి వాటితో పోలిస్తే జియో ధర చాలా తక్కువ కాబట్టి సహజంగానే కస్టమర్లు పెరుగుతారు.

ఇప్పటికే వందకు పైగా రాబోయే సినిమాలు సిరీస్ ల గురించి ముంబైలో గ్రాండ్ ఈవెంట్ చేసి మరీ టైటిల్స్ ప్రకటించిన జియో సినిమా నెక్స్ట్ దక్షిణాది మార్కెట్ ని టార్గెట్ చేయబోతోంది. చూస్తుంటే ఇప్పటి నుంచి ఒక లెక్క నేనొచ్చాక ఒక లెక్క అనిపించే రేంజ్ ముఖేష్ పెద్ద స్కెచ్చే వేసినట్టు కనిపిస్తోంది. ఇది ఒకరకంగా మంచిదే కానీ ముందు 4జిలు ఫ్రీగా ఇచ్చి ఇప్పుడు నెలకు రెండువందలకు పైగా ఛార్జ్ చేసినా వాడకుండా ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చిన జియో ఇప్పుడీ స్ట్రాటజీల వల్ల భవిష్యత్తులో ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో వేచి చూడాలి. వూట్ ఇప్పటికే ఇందులో కలిసిపోయిన సంగతి తెలిసిందే.